
జార్ఖండ్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి శునకాలంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఎప్పుడైనా విరామం లభిస్తే చాలు ధోనీ తన ఇంట్లో ఉన్న పెంపుడు శునకాలతో సరదాగా గడుపుతాడు. గతంలో ఓసారి పెంపుడు శునకాలకు క్యాచ్లు పట్టడం నేర్పిస్తున్న వీడియోను సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇక కరోనా మహమ్మారితో దేశంలో లాక్డౌన్ విధించడంతో గత మార్చి నుంచి ఫామ్ హౌస్కే పరిమితమైన ధోనీ.. ఆ పెంపుడు శునకాలతో అటాచ్మెంట్ మరింత పెంచుకున్నాడు. ముఖ్యంగా సామ్తో.
తాజాగా పెంపుడు శునకాలతో ఆడుకున్న వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్ క్లబ్ తన ఆధికారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ధోనీ తన కూతురు జీవాతో కలిసి సోపాలో కూర్చుని ఉండగా.. ఓ రెండు శునకాలు ధోనీ ఒడిలోకి వెళ్లి కూర్చున్నాయి. వాటికి ఆప్యాయంగా ధోనీ ముద్దు పెట్టి.. కౌగిలించుకున్నాడు. దీంతో పక్కనే ఉన్న జీవా.. అసూయతో ధోనీ వంక అలా చూస్తుండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా ఎంఎస్ ధోనీ తన ఇంట్లోని తోటలో ట్రాక్టర్ నడిపాడు. స్వరాజ్ ట్రాక్టర్ ఎక్కి రాంచీలోని తోటలో ఓ రౌండ్ వేసాడు. బైక్ నడిపినట్టుగానే చాలా సునాయాసంగా నడిపేశాడు. చివరకు ఇంజన్ ఆపేసి దిగిపోయాడు. అయితే మహీ ట్రాక్టర్ నడుపుతున్న సమయంలో పక్కన మరొకరు కూడా ఉన్నారు. ఈ వీడియోను సాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఐపీఎల్లో మహీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్లో జత చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా స్వర పరిచిన 'మౌనరాగం' అనే తమిళ సినిమా బ్యాక్గ్రౌండ్ను వీడియోకు జత చేసింది.
దేశంలో లాక్డౌన్ని ఎత్తివేసిన తర్వాత ఎంఎస్ ధోనీ తన ప్లాన్స్పై పక్కా క్లారిటీతో ఉన్నట్లు తాజాగా సాక్షి ధోనీ వెల్లడించారు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ఇన్స్టా లైవ్చాట్లో రూపా రమణితో సాక్షి మాట్లాడుతూ... 'లాక్డౌన్ తర్వాత క్రికెట్ ఉంటే.. ధోనీ మ్యాచ్లు ఆడతాడు. ఒకవేళ మ్యాచ్లు లేకపోతే.. నేను మహీ కలిసి మంచు కొండల్లో విహరించాలని ప్లాన్ చేసుకున్నాం. ధోనీకి మంచు అంటే మహా ఇష్టం. ఉత్తరాఖండ్లోని మంచు కొండల్లో విహరించాలని ధోనీ ఇప్పటికే ప్లాన్ చేసాడు' అని తెలిపారు.
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.