
మాంచెస్టర్: ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్లో రనౌట్ అయిన తరువాత టీమిండియా మాజీ సారథి, డాషింగ్ బ్యాట్స్మెన్ మహేంద్రసింగ్ ధోనీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఉబికి వస్తోన్న కన్నీటిని అణచివేసుకుంటూ పెవిలియన్ దారి పట్టాడు. న్యూజిలాండ్ ఫీల్డర్ మార్టిన్ గప్టిల్ మెరుపు వేగంతో సంధించిన బంతి.. ధోనీ క్రీజులోకి చేరుకకముందే బుల్లెట్లా వికెట్లను ఎగురగొట్టింది. దీనితో- ధోనీ తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. తల వంచుకుని పెవిలియన్కు మళ్లాడు. ఆ సమయంలో ధోనీ కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బుల్లెట్లా వికెట్లను తాకిన బాల్
న్యూజిలాండ్ ఇన్నింగ్ 48.3 ఓవర్లో ధోనీ రనౌట్ అయిన విషయం తెలిసిందే. అప్పటికి 10 పరుగుల్లో 25 పరుగులను చేయాల్సి ఉంది. ధోనీ క్రీజులో ఉండటంతో అభిమానుల్లో ఆశ చావలేదు. అంతకుముందే- ఓ బంతిని సిక్సర్గా మలిచాడతను. దీనితో- ధోనీ చివరికంటా క్రీజులో ఉండి టీమిండియాను గెలిపిస్తారని సగటు అభిమాని ఆశించాడు. ఫలితం- దీనికి భిన్నంగా వచ్చింది. 48 ఓవర్లో- లోకీ ఫెర్గూసన్ సంధించిన బంతిని ఆడటానికి ప్రయత్నించిన ధోనీ.. రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు.
ఓ రన్ పూర్తయిన తరువాత- మరొక పరుగు కోసం శరవేగంగా స్ట్రైకింగ్ ఎండ్ వైపు పరుగెత్తాడు. అప్పటికే- జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డీప్ మిడ్ వికెట్లో బంతిని అందుకున్న న్యూజిలాండ్ ఫీల్డర్ గప్టిల్.. దాన్ని సంధించగా.. అది నేరుగా వికెట్లను తాకింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ డైరెక్ట్ త్రో ఫలితంగా- ఒక్కసారిగా స్టేడియం మూగబోయింది. ధోనీ సైతం దిగాలుగా వెనుదిరిగాడు.
ఏడ్చేసిన ధోనీ!
బంతి వికెట్లను తాకిన వెంటనే- ఫీల్డ్ అంపైర్లు దీన్ని థర్డ్ అంపైర్కు అప్పగించారు. స్లో మోషన్లో పరిశీలించిన అనంతరం అవుట్గా తేల్చారు. తాను అవుట్ అయిన విషయాన్ని అప్పటికే నిర్ధారించుకున్నాడు ధోనీ. థర్డ్ అంపైర్ నిర్ణయం వెలువడగానే- తల కిందికి వాల్చేశాడు. వంచిన తలను ఎత్తకుండా పెవిలియన్ దారి పట్టాడు.
ఆ సమయంలో- ధోనీ కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో అభిమానుల హృదయాలను బరువెక్కిస్తోంది. డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన తరువాత కూడా చాలా సేపటి వరకూ తోటి క్రికెటర్లెవరితోనూ మాట్లాడలేదట ధోనీ.