ముంబై: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై వస్తున్న విమర్శలపై భారత మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ తీవ్రంగా స్పందించాడు. ధోని క్రికెట్ నుంచి ఎందుకు తప్పుకోవాలో చెప్పాలంటూ విమర్శకులను సూటిగా ప్రశ్నించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో, గొప్ప నాయకుల్లో ధోని ఒకడని.. అలాంటివాణ్ని దిగిపోవాలంటూ చేస్తున్న వాదనకు అసలు అర్థమే లేదంటూ కొట్టిపారేశాడు.
'ధోని స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరా? విరాట్ వచ్చేది మూడో స్థానంలో. ఇప్పుడు ధోని సగటు 52.66. ప్రపంచంలో అత్యుత్తమం. అందుకే దిగిపొమ్మంటున్నారా' అని ప్రశ్నించాడు. ధోని గురించి భారత్లో కొందరు మాట్లాడుతున్న తీరు చూసి విదేశాల్లో తన లాంటి వారు ఆశ్చర్యపోతున్నారని గ్యారీ చెప్పాడు.

'మేం బయటి నుంచి గమనిస్తుంటాం. ధోని దిగిపోవాలన్నప్పుడు మేమంతా ఆశ్చర్యపోయాం. ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో అతడు ఒకడని నేనెప్పటికీ చెబుతా. టీమ్ఇండియా అత్యుత్తమ కెప్టెన్గా చరిత్ర అతణ్ని గుర్తుపెట్టుకుంటుంది. అతడి ప్రదర్శనలే దానికి రుజువు. వేరే ఆటగాళ్ల పట్ల కూడా విమర్శకులు ఇలాగే వ్యవహరిస్తారా? సచిన్ విషయంలోనూ ఇలానే చేసేవారా? నాకైతే ఇది చాలా అన్యాయమనిపిస్తోంద' అని కిర్స్టెన్ చెప్పాడు.
ధోని-కిర్స్టెన్ హయాంలోనే భారత జట్టు 2009లో ఐసీసీ టెస్టు నెం.1గా, 2011లో ప్రపంచకప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, తనను మళ్లీ కోచ్ బాధ్యతలను తీసుకోవాలని బిసిసిఐ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపిన గ్యారీ.. ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోలేనని చెప్పాడు.