న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా ప్రపంచంలోని వివిధ దేశాల క్రికెటర్ల మధ్య క్రీడా స్ఫూర్తి పెరిగిందని, దీని వల్ల బూతులు తిట్టుకోవడం(అగ్లి స్లెడ్జింగ్) పూర్తిగా క్రికెట్ నుంచి దూరంగా వెళ్లిపోయిందని భారత వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఐపిఎల్, అలాంటి అన్ని టి20 లీగ్లు అంతర్జాతీయ మ్యాచుల మధ్య మంచి వాతావరణం నెలకొల్పుతున్నాయని చెప్పాడు.
'మేం ఆడుతున్నది జెంటిల్మెన్ గేమ్. మేం గెలవాలనుకుంటున్నాం, కానీ అది సరైన పద్ధతిలో ఉండాలి. ఐపిఎల్.. అగ్లి స్లెడ్జింగ్ను క్రికెట్ నుంచి దూరం చేసింది. ఈ ట్వంటీ లీగ్స్ ప్రపంచ ఆటగాళ్ల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాయి' అని ధోనీ చెప్పాడు. సిటీ హోటల్లో జరిగిన డిజిటల్ మూవ్మెంట్ 'యారీ' ప్రమోషన్ ఈవెంట్లో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ తోపాటు పాల్గొన్న ధోనీ, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు.
'స్లెడ్జింగ్ను నియంత్రించడంలో ఐపిఎల్ ఎంతో సహాయపడింది. ఇతర దేశాలు, సంస్కృతులకు చెందిన ఆటగాళ్లు ఐపిఎల్ కారణంగా ఒకే డ్రెస్సింగ్ రూంను పంచుకున్నారు. వారు వారివారి అభిప్రాయాలను, సంస్కృతిని ఇతర ఆటగాళ్లతో పంచుకున్నారు. ఐపిఎల్ లేకుంటే ఈ ఆటగాళ్లందరి కలిసి వ్యక్తిగతంగా దగ్గరయ్యేవారు కాదు' అని ధోనీ తెలపాడు.

'ఐపిఎల్ టీంల పాలసీ కారణంగా ఇతర జట్లలోని భారత ఆటగాళ్లను కూడా నేను కలవలేదు. ఐపిఎల్ కారణంగా అందరు ఆటగాళ్లు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నారు' అని చెప్పాడు. కాగా, ధోనీ చేసిన వ్యాఖ్యలను క్రిస్ గేల్ సమర్థించాడు. ధోనీకే సాధ్యమైన 'హెలికాప్టర్ షాట్'ను కూడా గేల్ ఆడుతున్న విషయం తెలిసిందే.
'ఐపిఎల్ గురించి ధోనీ చెప్పిన దానిలో వాస్తవం ఉంది. అది నేను అంగీకరిస్తున్నా. క్రికెట్ సామ్రాజ్యంలో ఐపిఎల్ అద్భుతాలు చేసింది. అయితే ఇక్కడ స్నేహపూర్వక స్లెడ్జింగ్ మాత్రమే ఉంది. నేను, ముంబై ఇండియన్స్ ఆటగాడైన కీరన్ పొలార్డ్తో స్లెడ్జింగ్ని ఎంజాయ్ చేశా. అయితే అది అంతవరకే. తర్వాత అంతా కూల్' అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సిబి) విధ్వంసకర ఓపెనర్ చెప్పాడు.
'ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఐపిఎల్ ద్వారానే కలిశాను. ఆర్సిబి జట్టే కావడంతో ఒకే జట్టుగా ముందుకెళ్లాం. డ్రెస్సింగ్ రూంలో అతడు మరో ఆటగాడు. అతడు ఎంతో తక్కువగా మాట్లాడతాడు. అతడ్ని కలవడం మంచి పరిణామం' అని చెప్పాడు.