హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బాత్రూంలో కూడా ప్రైవసీ దొరకడం లేదు. అక్కడ కూడా ఇంటర్వ్యూలు చేసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కూతురు పూర్ణా పటేల్ వివాహ వేడుకకు భార్య సాక్షి, కూతురు జీవాలతో హాజరైన ధోనీ అక్కడ తన స్నేహితులతో సరదాగా గడిపాడు. వేడుక మధ్యలో వాష్రూమ్లో ధోనీతో సరదగా గడిపిన సన్నివేశాలను ప్రముఖ బాలీవుడ్ సింగర్ రాహుల్ వైద్య వీడియో తీసి అభిమానులతో పంచుకున్నాడు.
వీడియోలో రాహుల్ తనతో పాటు ధోనీని చూపిస్తూ 'మీరు బాత్రూంలో కూడా ఇంత కూల్గా ఎలా ఉంటారు?' అని అడిగాడు. దానికి బదులుగా ధోనీ కిందకు చూస్తూ.. 'ఏమో నాకు తెలీదు' అన్నాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. పార్టీలో సంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ధోనీ పెళ్లి వేడుకలో తన కూతురితో కలిసి డాన్స్ చేశాడు. సహచర క్రికెటర్లు, సినిమా నటులు, సెలబ్రిటీలతో చాలా సేపు మాట్లాడాడు. పార్టీకి క్రికెటర్లు, బాలీవుడ్ నటులు పెద్ద సంఖ్యలో రావడంతో పార్టీ మంచి జోష్లో నడిచింది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్లను పూర్తి చేసుకుంది. మొదటి సిరీస్ను గెలుచుకున్న టీమిండియా రెండోదైన వన్డే సిరీస్లో అంతగా రాణించలేకపోయింది. ఇందులో ధోనీ ఆటతీరు చాలా నెమ్మదిగా సాగింది. ఈ సిరీస్ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. సిరీస్ ముగిసిన తర్వాత ధోనీ మ్యాచ్ బాల్ను అంపైర్ల నుంచి తీసుకున్నాడు. ఈ వీడియో సైతం ఇటీవల బాగా వైరల్ అయింది.
ఇంకేముంది ధోనీ రిటైరైపోతున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఈ వన్డే సిరీస్లో తన ఆటతీరుతో విమర్శల పాలైన ధోనీ.. క్రికెట్ కెరీర్లోనే ఇంతగా విమర్శలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. అయితే ఆ విమర్శలేవీ ధోనీపై పనిచేయవనేది వేరే విషయం.