న్యూఢిల్లీ: 2019 వరల్డ్ కప్ వరకు పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలని సెలక్టర్లు కోరుకుంటున్నారు. వచ్చే వరల్డ్ కప్ వరకు తాను క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ధోని ఇటీవలే మీడియా సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
అలెన్ బోర్డర్కు షాక్: వన్డే కెప్టెన్గా ధోని ఖాతాలో మరో రికార్డు
ఈ నేపథ్యంలో ధోనికి భారత్ క్రికెట్కు చెందిన పలువురు మాజీలతో పాటు ప్రస్తుత క్రికెటర్ల సైతం మద్దతుగా నిలిచారు. తాజాగా ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ కూడా 2019 వరకు ధోనిని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ధోని నేతృత్వంలోని టీమిండియా భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన సంగతి తెలిసిందే. ఇటీవలే న్యూజిలాండ్తో ముగిసిన వన్డే సిరిస్లో కూడా ధోని సేన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జట్టులో సమతుల్యత చక్కగా ఉందని ఇదే జట్టుని 2019 వరకు కొనసాగించాలనే ఆలోచనకు సెలక్టర్లు వచ్చినట్లు తెలుస్తోంది.
ఫిట్నెస్ పరంగా ధోని చక్కగా ఉన్నాడని, వచ్చే వరల్డ్ కప్ వరకు ధోని అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగితే సెలక్టర్లకు కూడా వారి జాబ్ సులభం అవుతుందని కమిటీలోని సభ్యుడు ఒకరు తెలిపారు. వయసుతో పాటు ఫిట్ నెస్ పరంగా ధోని అత్యుత్తమ ప్రదర్శన కనపరుస్తుండటంతో ధోనిని తప్పించాలనే ఆలోచన కూడా సెలక్టర్లకు లేదని తెలిపారు.
2017లో ఇంగ్లాండ్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీపై సెలక్టర్లు దృష్టి సారించనున్నారు. దీని తర్వాతే ధోని భవితవ్యంపై సెలక్టర్లు ఓ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాడు. కెప్టెన్గా ధోని సేవలు ఇంకా టీమిండియాకు అవసరమని అతడు స్పష్టం చేశాడు.
ధోని రాబోయే మూడు సంవత్సరాలు కూడా ఆడితే అది జట్టుకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపాడు. జట్టులో ఇతర ఆటగాళ్ల పట్ల ధోని చూపించే తీరు రోజు రోజుకీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని తెలిపాడు. రాబోయే రోజుల్లో ధోని తన కెరీర్లోనే అత్యుత్తమ క్రికెట్ ఆడతాడని సెలక్టర్లు భావిస్తున్నారని చెప్పుకొచ్చాడు.
బీసీసీఐ అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడు. మూడు ఫార్మెట్లలో కూడా టీమిండియాకు ధోని ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. వన్డేల్లో భారత జట్టుకు 108 విజయాలను అందించిన ధోని ప్రపంచంలోనే ఎక్కువ విజయాలను అందించిన రెండో కెప్టెన్గా ఉన్నాడు.