

హైదరాబాద్: 2018లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రదర్శన అభిమానులను నిరాశ పరిచింది. గతేడాది 20 వన్డేలాడిన ధోని కేవలం 275 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, గతంలో టీమిండియాకు అద్భుత విజయాలను అందించడంతో ఇంకా ధోనికి జట్టు మేనేజ్మెంట్ అవకాశాలను కల్పిస్తోంది.
ప్రస్తుతం ధోని శనివారం నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరిస్కు సిద్ధమవుతున్నాడు. ఈ సిరిస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ సిరిస్, ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ సిరిస్లలో రాణించి ధోని తిరిగి ఫామ్ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
వన్డే వరల్డ్కప్ ఆరంభానికి ముందు భారత్ 13 వన్డేలు మాత్రమే ఆడనుండటంతో అందరి దృష్టి ధోనిపైనే ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భారత్ తరఫున నంబర్ వన్ ప్లేయర్గా అవతరిస్తాడని మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తెలిపాడు. ప్రపంచ కప్లో ధోనీ అనుభవం భారత్కు ఉపకరిస్తుందని అన్నాడు.
అపార అనుభవం ఉన్న ధోని, తన నైపుణ్యంతో వరల్డ్ కప్లో కీలక పాత్ర పోషిస్తాడని తెలిపాడు. ధోనీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన అజహరుద్దీన్.. వికెట్ల వెనుక నుంచి అతడు ఆటగాళ్లకు దిశా నిర్దేశం చేస్తాడని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అజహరుద్దీన్ మాట్లాడుతూ "బౌలర్లు ఎక్కడ బంతులేయాలనే విషయంలోనూ ధోని సూచనలిస్తాడు. ఫీల్డింగ్ సెట్ చేయడంలోనూ కోహ్లీకి సహకారం అందిస్తాడు. అత్యంత అనువజ్ఞుడైన, విజయవంతమైన కెప్టెన్ ధోనియే" అని అన్నాడు. కాగా, వరల్డ్ కప్లో ధోని అనుభవం జట్టుకు ఎంత ఉపయోగమో పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియాకు వైస్కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ వెల్లడించాడు.