హైదరాబాద్: మొహాలి వేదికగా ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ధోని 9 వేల పరుగులను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో వన్డేలో న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ సట్నర్ వేసిన 17వ ఓవర్లో ఐదో బంతిని సిక్స్గా మలిచి ధోని ఈ ఘనతను సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దీంతో 9వేల పరుగులను చేరుకున్న 5వ భారత ఆటగాడిగా నిలిచాడు. 35 ఏళ్ల ధోని భారత్ తరుపున 280 వన్డేలాడి 8,978 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు ఉండగా, 60 అర్ధ సెంచరీలు ఉన్నాయి. డిసెంబర్ 23, 2014న బంగ్లాదేశ్లోని చిట్టగ్యాంగ్లో ధోని అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు.
ఈ మ్యాచ్లో ఒక బంతిని ఎదుర్కొన్న ధోని రనౌట్ కావడంతో డకౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆడిన రెండు వన్డేల్లో కూడా 12,7 పరుగులు మాత్రమే చేశాడు. అయితే విశాఖపట్నంలో పాకిస్థాన్పై జరిగిన వన్డే మ్యాచ్లో 148 పరుగులు చేసి అంతర్జాతీయ క్రీడాకారుల దృష్టిని ఆకర్షించాడు.

ఆనాటి ఈనాటి వరకు ధోని కెప్టెన్గా, వికెట్ కీపర్గా బ్యాట్స్ మెన్గా భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించాడు. మూడో వన్డేలో ధోని 9000 పరుగుల మైలురాయిని అందుకుని ఇండియన్ బ్యాట్స్మెన్ ఎలైట్ గ్రూపులో ధోని చేరాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ, అజారుద్దీన్ తర్వాత 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఐదో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
మొత్తంగా చూస్తే 9వేల పరుగుల మైలురాయిని అందుకున్న 17వ బ్యాట్స్ మెన్. భారత్ తరుపున 90 టెస్టులాడిన ధోని 4,876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు సాధించాడు. టెస్టు క్రికెట్ నుంచి 2014లో ధోని వైదొలగాడు. తన క్రికెట్ కెరీర్లో మూడు ఐసీసీ ట్రోఫీలు(2007లో వరల్డ్ టీ20, 2011లో వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ) అందుకున్న కెప్టెన్గా ధోని చరిత్ర సృష్టించాడు.
దీంతో పాటు భారత్ తరుపున వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్గా కూడా ధోని అవతరించాడు. అంతకుముందు వన్డేల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 195 సిక్స్ల రికార్డును మూడో వన్డేలో ధోనీ అధిగమించాడు. ఈ మ్యాచ్లో ధోని మూడు సిక్స్లతో 196 సిక్స్లు నమోదు చేశాడు.

కాగా, అంతర్జాతీయ క్రికెట్లో అందరికంటే ఎక్కువగా పాకిస్థాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ 351 సిక్స్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. భారత్ తరుపున అత్యధిక సిక్సులు కొట్టి ఆటగాళ్లలో ధోని తర్వాత సచిన్ టెండూల్కర్ ఉండగా, ఆ తర్వాతి స్థానంలో సౌరభ్ గంగూలీ (189) ఉన్నారు.
మూడో వన్డేలో ధోని సృష్టించిన రికార్డులపై నెటిజన్లు ధోనిని ప్రశంసలతో ముంచెత్తారు: