

హైదరాబాద్: టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికినా, తన క్రికెట్ కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోని ఆదాయం మాత్రం తగ్గట్లేదు. తాజాగా ధోని ఆదాయపు పన్ను చెల్లించడంలోను రికార్డు సృష్టించాడు. 2017-18 వార్షిక సంవత్సరానికి జార్కండ్లో అత్యధిక పన్ను చెల్లించి వ్యక్తిగా ధోని నిలిచాడు.

ఈ ఆర్ధిక సంవత్సరంలో ధోని ఏకంగా రూ.12.17 కోట్ల ఆదాయపు పన్ను కట్టినట్లు జార్ఖండ్ ఆదాయపు పన్ను అధికారులు వెల్లడించాడు. 2016-17తో పోలిస్తే ఇది 1.24 కోట్లు ఎక్కువ అని జార్ఖండ్ ఇన్కమ్ టాక్స్ అధికారులు పేర్కొన్నారు. కాగా, గతేడాది ధోని రూ.10.93 కోట్ల పన్ను కట్టాడు.
పన్ను చెల్లించడమే కాకుండా, రానున్న వార్షిక ఆదాయానికి సంబంధించి సుమారు మూడు కోట్ల రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్ను ముందే డిపాజిట్ కూడా చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రకటించిన ఎక్కువగా ఆర్జించే భారత క్రికెటర్ల జాబితాలో ధోని మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.
తొలి రెండు స్థానాల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఇక, 2017 ఫోర్బ్స్ సెలబ్రిటీల లిస్టులో ధోని ఎనిమిదో స్థానంలో నిలిచాడు. గతేడాది రూ. 63.7 కోట్లు ఆర్జించాడు. 2017లో ధోని సెవెన్ అనే బ్రాండ్తో దుస్తుల మార్కెట్లలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.
హాకీ ఇండియా లీగ్లో రాంచీ రేస్, ఇండియన్ సూపర్ బాల్ లీగ్లో చెన్నై ఎఫ్సీ ఫుట్బాల్ ఫ్రాంచైజీలకు ధోని సహ యజమానిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరిస్లో పాల్గొన్న ధోని, అనంతరం భారత్కు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం కుటుంబంతో జాలీగా ఎంజాయ్ చేస్తున్నాడు.