
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రూ.150 కోట్లను ఆర్జించిన తొలి క్రికెటర్గా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు సాధించాడు. 2020 వరకు ధోనీ ఐపీఎల్ లీగ్ ద్వారా రూ.137 కోట్ల ఆదాయం పొందగా.. చెన్నై ఫ్రాంచైజీ ఈ ఏడాది సీజన్కు కూడా కొనసాగించడంతో మహీ సంపాదన రూ.152 కోట్లకు చేరింది. దీంతో రూ.150 కోట్ల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా (భారత్ లేదా విదేశీ) నిలిచాడు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం ధోనీకి రూ.15 కోట్లని చెన్నై ఫ్రాంఛైజీ చెల్లించనుంది. మహీ ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తం 13 సీజన్లు ఆడాడు.
2008 నుంచి ఐపీఎల్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి ఏడాదికి రూ.6 కోట్లు తీసుకున్న ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్ 2021 సీజన్ వరకల్లా రూ.15 కోట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ 2008 సీజన్ వేలంలో రూ.6 కోట్లకి ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. మూడేళ్లు అదే ధరకి కొనసాగాడు. 2011లో బీసీసీఐ ఫస్ట్ ఛాయిస్ రిటెన్షన్ ప్లేయర్ ధరని రూ.8 కోట్లకి పెంచింది. దాంతో 2011 నుంచి 13 వరకు రూ.8.25 కోట్లు ఆర్జించాడు. 2014లో మెగా వేలానికి ముందు బీసీసీఐ ఫస్ట్ ఛాయిస్ రిటెన్షన్ ప్లేయర్ ధరని రూ.12 కోట్లకి పెంచగా.. 2014, 2015 సీజన్లలో ధోనీకి రూ.12.5 కోట్లని చెన్నై చెల్లించింది.
ఫిక్సింగ్ కారణంగా 2016, 2017 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై నిషేధం పడటంతో.. ఆ రెండేళ్లు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్కి ఎంఎస్ ధోనీ ఆడాడు. అప్పుడు కూడా ఒక్కో ఏడాది రూ.12.5 కోట్లు ఆర్జించాడు. ఇక 2018లో ఐపీఎల్లోకి చెన్నై రీఎంట్రీ ఇవ్వగా.. అప్పటి నుంచి ధోనీని రూ.15 కోట్లు చొప్పున చెన్నై రిటైన్ చేసుకుంటూ వస్తోంది. మొత్తంగా 14 సీజన్లకి గానూ ధోనీ ఆదాయం రూ. 152 కోట్లుగా ఉంది. మహీ తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రూ. 146.6 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ రూ. 143.3 కోట్లతో ఉన్నారు.
ఐపీఎల్ ఆరంభం నుంచి ఎంఎస్ ధోనీ చెన్నై జట్టుకు సారథిగా ఉంటున్నాడు. ఐపీఎల్ 2020లో మహీ నాయక్వంలోని చెన్నై జట్టు మొదటిసారి ప్లేఆఫ్స్కు చేరలేదు. 2016, 2017 సీజన్లు మినహాయిస్తే.. మిగతా పది సీజన్లలోనూ చెన్నై అదరగొట్టింది. ప్రతిసారి ప్లేఆఫ్స్, సెమీస్ లేదా ఫైనల్స్ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది. మరీ ముఖ్యంగా 2010, 2011, 2018 సీజన్లలో ఛాంపియన్గా అవతరించింది. 2019లో సైతం ఫైనల్స్ చేరి చివరి బంతికి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. అయితే తొలిసారి 2020లో దారుణంగా విఫలమైంది. చెత్త ప్రదర్శనతో 7వ స్థానంతో ముగించింది. మరి ఈసారి ఎలా ఆడుతుందో చూడాలి. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 11న ఆరంభం అయ్యే అవకాశం ఉంది.