కెప్టెన్సీ నుంచి ధోనిని తప్పించడం వెనుక: గోయెంకా సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఐపీఎల్లో మొదటి సీజన్లోనే జట్టు ప్రదర్శన బాగా లేనంత మాత్రన మహేంద్ర సింగ్ ధోని లాంటి కెప్టెన్ను తప్పిస్తారా! ఇప్పుడు సగటు అభిమాని మదిలో ఉన్న ప్రశ్న ఇదీ. అయితే ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ఓ బలమైన కారణం ఉందనే అభిమానుల అనుమానాన్ని నిజం చేస్తూ రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం ఓ బెంగాలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ జట్టు యజమానులైన తమను ధోని పట్టించుకోకపోవడమే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణమని పేర్కొన్నాడు. 'ధోని మాకు ఫోన్లో కూడా ఎప్పుడూ అందుబాటులోకి రాలేదు. ఫ్రాంచైజీ కీలక సమావేశాలకు కూడా అతను రాలేదు. అతనితో మాట్లాడాలనుకున్న ప్రతీసారి ఏజెంట్ అరుణ్ పాండే ద్వారానే వెళ్లాల్సి వచ్చేది' అని తన ఆవేదన వెళ్లగక్కాడు.
గతేడాది ఐపీఎల్ లీగ్ సమయంలో కూడా జట్టు మీటింగ్లకు ధోని దూరంగా ఉన్నాడు. జట్టు కోచ్, ఆటగాళ్లు చర్చించిన ఫీల్డింగ్ను మ్యాచ్లో పూర్తిగా మార్చేసేవాడు. అతను ఆ సమావేశంలో లేకపోవడం వల్ల ఏం జరిగిందో కూడా ధోనీకి తెలీదని ఒక సీనియర్ ఆటగాడు మాకు చెప్పాడు' అని గోయెంకా పేర్కొన్నాడు.

నెట్ ప్రాక్టీస్లకు కూడా ధోని హాజరయ్యేవాడు కాదు
జట్టు నెట్ ప్రాక్టీస్లకు కూడా ధోని హాజరయ్యేవాడు కాదని చెప్పాడు. ఇక లెగ్స్పిన్నర్ ఆడమ్ జంపాను తుది జట్టులోకి తీసుకోమంటే తాను అతని ఆటను ఎప్పుడూ చూడలేదని చెప్పడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని పూణె జట్టు యజమాని సంజీవ్ గోయెంకా వ్యాఖ్యానించాడు.

మాపై ఒత్తిడి తీసుకొచ్చాడు
ఇదిలా ఉంటే దేశవాళీ టోర్నీలో మంచి ప్రదర్శనను కనబర్చని సౌరభ్ తివారిని జట్టులోకి తీసుకోవాలంటూ ప్రాంచైజీపై ఒత్తిడి తీసుకొచ్చాడని ఆయన తెలిపారు. ఈ క్రమంలో జట్టు జెర్సీ రంగు, డిజైన్కు సంబంధించి ధోని ఇచ్చిన సూచనలను యాజమాన్యం పట్టించుకోలేదని కూడా ఆయన అన్నారు.

క్రికెటేతర విషయాల్లో కావాలనే దూరం పెట్టాం
ముఖ్యంగా క్రికెట్కు సంబంధం లేని విషయాల్లో ధోని జోక్యాన్ని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ దూరం పెట్టింది. మరోవైపు జట్టు కెప్టెన్సీ మార్పు అనివార్యమని, జనవరిలోనే ధోనికి సమాచారం ఇచ్చామని ఆయన అన్నారు. దాంతో ‘మీరు ఏది సరైందని అనిపిస్తే అది చేయండి. ఇది మీ నిర్ణయం. నేను ఆటగాడిగానే ఉంటాను' అని ధోని అప్పుడే చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు.

మా నిర్ణయం అభిమానులకు నచ్చదని మాకు తెలుసు
ఈ నేపథ్యంలో ‘సామాన్య అభిమానులకు ఈ నిర్ణయం నచ్చదని మాకు తెలుసు. కానీ ఇదే సరైంది. నేను నిజాలను ఎప్పుడైనా మొహం మీదే చెప్పేస్తాను. ఫ్రాంచైజీ మేలు కోసమే ధోనిని తప్పించాం' అని గోయెంకా స్పష్టం చేశారు. కాగా, ఐపీఎల్ 10వ ఎడిషన్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనిని తప్పించిన పూణె ప్రాంఛైజీ తీరుపై మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ సైతం మండిపడ్డ సంగతి తెలిసిందే.

ధోనిని అవమాంచడమేనని అజారుద్దీన్ ఆగ్రహం
ఇది చెత్త నిర్ణయమని, ధోనిని అవమాంచడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'కెప్టెన్సీ నుంచి ఉద్వాసన పలికేటప్పుడు ధోనీ స్థాయి అతని ప్రతిష్టను, విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకొని ఉండాల్సింది. అతనికి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా? జట్టు బాగా ఆడకపోతే కెప్టెన్ ఏం చేస్తాడు? ధోనీ మంచి ఆటగాడు కాకుంటే.. స్ఫూర్తి నింపలేని నాయకుడే అయ్యుంటే ఐపీఎల్లో చెన్నైని రెండుసార్లు ఎలా గెలిపించేవాడా?' అని అజారుద్దీన్ మండిపడ్డాడు. ఈ నేపథ్యంలో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా ధోని తప్పించడానికి గల పరిస్థితులపై వివరణ ఇచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications