
న్యూఢిల్లీ: బిజినెస్ టుడే పత్రిక కవర్ పేజీపై విష్థువు రూపంలో తన ఫొటోను ప్రచురించిన వివాదంపై జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఆయన గురువారం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. 2013లో జరిగిన ఆ ఘటనపై ఆయన అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బెంగళూర్ అదనపు చఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో తనపై పెండింగులో ఉన్న క్రిమినల్ ప్రొసీండింగ్స్ను రద్దు చేసేందుకు కర్ణాటక హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును ఈ నెల 14వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
తనపై గల క్రిమినల్ కేసును కొట్టేయాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. ది గాడ్ ఆఫ్ బిగ్ డీల్స్ శీర్షికతో బిజినెస్ టుడే విష్ణువు రూపంలో ధోనీ చిత్రాన్ని ప్రచురించింది. హిందూ మతస్తుల మనోభావాలను, దేవుళ్లనూ దేవతలనూ కించపరిచారని ఆరోపిస్తూ ధోనీపై, ప్రచురణకర్తపై, సంపాదకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.