బెంగళూరు: గురువారం ఉదయం 7గంటలకు అలూరు మైదానానికి నలుగురు క్రికెట్ అభిమానులు వచ్చారు. బెంగళూరు నుంచి 40కిలోమీటర్ల దూరం ప్రయాణించి రెండు గంటల ముందే తమ హీరోను చూడాలనే ఆశతో వచ్చారు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా గురువారం బెంగళూరులో జమ్మూకాశ్మీర్తో జరుగుతున్న మ్యాచులో జార్ఖండ్ జట్టు తరపున భారత వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడాడు. మ్యాచుకు ముందే తమ హీరోను చూడాలని కొంతమంది అభిమానులు మైదానానికి చేరుకున్నారు.
ధోనీని చూసేందుకు ఎంతో ఆశగా వచ్చిన నలుగురు ఆ ఐటి నిపుణులను గేట్ సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారు. వారిని లోనికి వెళ్లనివ్వలేదు. ఇక చేసేదేమీ లేక లంచం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

'మేము నైట్ షిప్టులో పని చేసి నేరుగా గురువారం ఉదయం 7గంటలకు మైదానానికి వచ్చేశాం. చాలా మంది అభిమానులు వస్తారని ఊహించే అందరికంటే ముందే ఇక్కడికి చేరుకున్నాం. రూ. 1400లను సెక్యూరిటీ సిబ్బందికి ఇచ్చాం' అని ఆ నలుగురు సాఫ్ట్వేర్ ఇంజినీర్లలో ఒకరైన విగ్నేశ్వర్ శేఖర్ తెలిపారు.
లంచం ఇచ్చిన తర్వాత ఆ నలుగురు స్నేహితులు గేట్ గుండా వెళ్లి ధోనీ కోసం మైదానంలో ఎదురుచూశారు. 90నిమిషాల తర్వాత టాస్ వేశారు. జమ్మూకాశ్మీర్ కెప్టెన్ మిథున్ మన్హాస్ టాస్ గెలిచి ఫీల్డ్ ఎంచుకున్నాడు. సగం మ్యాచ్ అయిన తర్వాత ధోనీ బ్యాట్ పట్టుకుని మైదానంలో అడుగుపెట్టాడు.
10.29గంలకు 20ఓవర్లు ఆడిన జార్ఖండ్ 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. ఆ సమయంలోనే ధోనీ మైదానంలోకి అడుగుపెట్టగా.. అభిమానులు కేకలు వేస్తూ ఉత్సాహ పర్చారు. తొలుత సింగిల్స్ తీసిన ధోనీ.. తొలి బౌండరీ కొట్టగానే అభిమానులు మరోసారి కేరింతలు కొట్టారు.

కాగా, 10.56గంటలకు పర్వేజ్ రసూల్.. ధోనీ ఇచ్చిన అద్భుత క్యాచ్ను పట్టుకుని అతడ్ని పెవిలియన్ చేర్చాడు. 24బంతులాడిన ధోనీ కేవలం 9పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఒక్కసారిగా అభిమానులందరూ నిరాశకు గురయ్యారు.
బెంగూళరులో ఆడేందుకు ధోనీ వస్తున్నాడని తెలిసి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యామని, వెంటనే ఇక్కడకు వచ్చేశామని శేఖర్ స్నేహితుడు కె అత్తిమాన్ తెలిపారు. ధోనీలా మ్యాచ్ గెలిపించే ఆటగాడ్ని ఇంతవరకు చూడలేదని మంజునాథ్ అనే బార్బర్ చెప్పారు.