హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... ఓ బ్యాట్స్మెన్గా కంటే వికెట్ కీపర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించిన ఆటగాడు. అంతేకాదు ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు. నిజం చెప్పాలంటే ప్రపంచ క్రికెట్ చరిత్రలో స్టంపౌట్కి ఒక క్రేజ్ తీసుకొచ్చిన వికెట్ కీపర్ ధోనియే.
మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగుతున్నా... మెరుపు వేగంతో వికెట్లను గీరాటేయడం మహేంద్ర సింగ్ ధోనికే చెల్లుతుంది. అలాంటి ధోనీని వెస్టిండీస్ యువ వికెట్ కీపర్ సాహి హోప్ స్టంపౌట్ చేసేందుకు విఫలయత్నం చేశాడు. ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం కోహ్లీసే ప్రస్తుతం వెస్టిండిస్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

శుక్రవారం ఆంటిగ్వాలోని వివ్ రిచర్డ్స్ మైదానంలో భారత్, వెస్టిండిస్ జట్ల మధ్య మూడో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో ఇన్నింగ్స్ 41వ ఓవర్ వేసిన వెస్టిండీస్ స్పిన్నర్ బిషూ బౌలింగ్లో క్రీజు వెలుపలికి వెళ్లి షాట్ కొట్టేందుకు ధోనీ ప్రయత్నించాడు. షాట్ని పసిగట్టిన బిషూ తెలివిగా ఆఫ్ స్టంప్కి దూరంగా బంతిని విసిరాడు.
అతను ఊహించినట్లే బంతి బ్యాట్స్మెన్కి అందకుండా వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. కానీ.. స్టంపౌట్ ప్లాన్ని ముందుగానే పసిగట్టిన ధోని బంతి దూరంగా పడి అది వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లోలోపే క్రీజులోకి వచ్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోని చూసి స్టంపింగ్స్కి ఒక స్కూల్ పెడితే.. అందులో హెడ్మాస్టర్ ధోని.. అలాంటి ధోనీనే స్టంపౌట్ చేయగలరా..? అంటూ అభిమానులు తెగ కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో టీమిండియా 93 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కాగా, మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ఖాతాలోకి మరో రెండు రికార్డులు వచ్చి చేరాయి. 79 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 78 పరుగులతో అజేయంగా నిలవడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత్ బ్యాట్స్మన్గా, వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భారత క్రికెటర్గా ధోని చరిత్ర సృష్టించాడు.