
హైదరాబాద్: మాంచెస్టర్ వేదికగా విండిస్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటతీరుపై విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. 140/4తో జట్టు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన ధోని.. పరుగులు రాబట్టడంలో చాలా ఇబ్బంది పడ్డాడు. ఒకనొక దశలో ధోని 40 బంతుల్లో 20 పరుగులే చేశాడు.
ఆప్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో డకౌట్గా పెవిలియన్కు చేరిన ధోని... విండిస్తో జరిగిన మ్యాచ్లో కూడా స్టంపౌట్ కావాల్సింది. 8 పరుగుల వద్ద విండిస్ స్పిన్నర్ ఫబియాన్ అలెన్ వేసిన 34 ఓవర్ తొలి బంతిని ఆడేందుకు ధోని ముందుకొచ్చాడు. అయితే బ్యాట్కు దూరంగా వెళ్లిన బంతి వికెట్ కీపర్ చేతుల్లో పడింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే తొలి ప్రయత్నంలో ధోనిని స్టంపౌట్ చేయడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత ధోని క్రీజులో వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో హోప్కు మరో అవకాశం లభించినప్పటికీ స్టంపౌట్ చేయడంలో విఫలమయ్యాడు. దీంతో భారత అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. చివరి ఓవర్లో మాత్రం ధోని అనూహ్యంగా చెలరేగడంతో 61 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
చివరి ఓవర్ మెరుపులను మినహాయిస్తే ఈ మ్యాచ్లో ధోని బాగా ఇబ్బందులు పడ్డాడని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే, జట్టులోని ఆటగాళ్లు మాత్రం ధోనికి మద్దతుగా నిలిచారు. మ్యాచ్ అనంతరం ధోని ఇన్నింగ్స్పై కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనియాడగా... తాజాగా బుమ్రా సైతం ప్రశంసలు కురిపించాడు.
"ధోని ఆడిన ఇన్నింగ్స్ చాలా విలువైనది. కొన్ని సందర్భాల్లో ధోని నెమ్మదిగా ఆడతాడు. అప్పుడు కొన్ని బంతులు వృథా అవ్వడం సహజం. బౌలింగ్కు అనుకూలించే పిచ్పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అప్పుడు కుదురుకోవడానికి సమయం పడుతుంది. ఈ తరహా వికెట్పై 268 స్కోరు తక్కువేం కాదు. ధోని ఆఖరి ఓవర్ వరకు క్రీజులో ఉండటం వల్లే మంచి స్కోరును బోర్డుపై ఉంచకలిగాం" అని అని బుమ్రా పేర్కొన్నాడు.