హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య గురువారం నాలుగో వన్డే జరగనుంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ నాలుగో వన్డేకు ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ స్పష్టమైన గుర్తింపు రాబోతోంది. ఈ వన్డే ద్వారా ధోని తన క్రికెట్ కెరీర్లో ఓ అరుదైన రికార్డుని అందుకోబోతున్నాడు.
ఈ వన్డే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి 300వ వన్డే కావడమే. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా ధోని నిలవనున్నాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్(363), రాహుల్ ద్రవిడ్(344), అజారుద్దీన్(334), గంగూలీ(311), యువరాజ్ (302)లు మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు.

భారత క్రికెట్ ముద్దుగా 'మిస్టర్ కూల్' అని పిలుచుకునే ధోని ఈ మ్యాచ్ కోసం ఆతృతగా వేచి చూస్తున్నాడు. వన్డే క్రికెట్లో గొప్ప ఫినిషర్గా పేరున్న ధోని... గత రెండు మ్యాచ్ల్లో ఛేదనలో కీలక ఇన్నింగ్స్లతో భారత్కు విజయాన్ని అందించాడు. అలాంటే ప్రదర్శనతోనే ఈ మ్యాచ్నూ చిరస్మరణీయం చేసుకోవాలని ధోని భావిస్తున్నాడు.
మోరోవైపు ఈ మ్యాచ్ కోసం అటు ప్రపంచ క్రికెట్, ఇటు భారత అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వన్డేలో ధోని ఓ ఆటగాడిగా మరో రెండు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఈ మ్యాచ్లో ధోని ఒక్క స్టంపింగ్ చేస్తే వన్డేల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్గా ప్రపంచ రికార్డుని సృష్టిస్తాడు.
తన కెరీర్లో ఇప్పటివరకు 299 వన్డేలాడిన ధోని ప్రస్తుతం 99 స్టంపింగ్స్తో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కరతో సమానంగా ఉన్నాడు. ఇక బ్యాట్స్మెన్గా ధోనిని మరో ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో ధోని నాటౌట్గా నిలిస్తే వన్డేల్లో అత్యధికసార్లు నాటౌట్గా ఉన్న రికార్డు కూడా సొంతమవుతుంది.
ప్రస్తుతం 72 నాటౌట్లతో ధోనీ షాన్ పొలాక్, చమిందా వాస్లతో సమానంగా నిలిచాడు. ఈ సిరిస్లో ఇప్పటికే ధోని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ధోని 299 వన్డేలాడి 9608 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తన కెరీర్లో 300వ వన్డే ఆడబోతున్న ధోనికి అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.