హైదరాబాద్: తన కెరీర్లో 300వ వన్డే ఆడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై పలువురు క్రికెట్ మాజీ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపించారు. కొలంబో వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య గురువారం ప్రారంభమైన నాలుగో వన్డే ధోనికి 300వ వన్డే.
ఈ వన్డే ద్వారా భారత్ తరఫున ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా ధోని నిలిచాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్(463), రాహుల్ ద్రవిడ్(344), మహమ్మద్ అజారుద్దీన్(334), సౌరవ్ గంగూలీ(311), యువరాజ్ సింగ్(302)లు మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు.

నాలుగో వన్డే ప్రారంభానికి ముందు తన కెరీర్లో 300వ వన్డే ఆడుతోన్న మహేంద్ర సింగ్ ధోనీకి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక జ్ఞాపికను అందజేశాడు. ఇక అంతర్జాతీయ స్థాయిలో చూసుకుంటే.. 300 వన్డేలను పూర్తి చేసుకోబోతున్న 20వ ఆటగాడిగా ధోని నిలిచాడు.
ఇక భారత్ తరుపున క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 463 వన్డే మ్యాచ్లు ఆడి.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. సచిన్ తర్వాత ప్రపంచ క్రికెట్లో మాజీ కెప్టెన్ మహేళ జయవర్దనే 448 వన్డేలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత కూడా శ్రీలంక ధిగ్గజాలే ఉన్నారు.
జయసూర్య 445 వన్డేలు, సంగాకర 404 వన్డేలు ఆడారు. వీరు నలుగురు మాత్రమే నాలుగు వందలకు పైగా వన్డే మ్యాచ్లను ఆడారు. దీంతో ఈ మైలురాయి వన్డే మ్యాచ్లో ధోని గుర్తుండి పోయే ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
300వ వన్డే ఆడుతున్న ధోనికి మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, సురేశ్ రైనా, మహమ్మద్ షమీ, హేమాంగ్ బదాని, ఇషాంత్ శర్మ, కామెంటేటర్ హర్షా బోగ్లే తదితరులు ఉన్నారు.