ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లెమన్ ట్రీ హెటల్లో స్పెషల్ జనరల్ మీటింగ్ అనంతరం అధికారికంగా ఈ ప్రకటన విడుదల చేశారు. మరో ప్యానెల్ నుంచి నామినేషన్లు దాఖలు కాకపోవడంతో కేశినేని ప్యానెల్ ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఏసీఏ ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్, కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విష్ణుకుమార్ రాజు, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ గా గౌరు విష్ణుతేజ్ ఎన్నికయ్యారు. కాగా, వరద బాధితులకు సాయం అందించాలని నూతన కార్య వర్గం తమ తొలి నిర్ణయాన్ని తీసుకుంది. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించింది.

కాగా, శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలోని గోపీనాథ్ రెడ్డి కార్యదర్శిగా ఉన్న ఏసీఏ కార్యవర్గం ఆగష్టు 4న రాజీనామా సమర్పించిన విషయం తెలిసిందే. అయితే కొత్త కార్యవర్గం ఎన్నికకు కేశినేని ప్యానెల్ నుంచి మాత్రమే నామినేషనల్ దాఖలయ్యాయి. అన్ని పదవులకు ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడంతో గత నెల 17నే ఏసీఏ కొత్త వర్గం ఖరారైంది. అయితే ఫలితాల అధికారిక ప్రకటన కోసం ఇన్ని రోజుల ఎదురుచూడాల్సి వచ్చింది.