టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా లేని సమయంలో పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్న వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్. టీ20 వరల్డ్ కప్లో కూడా రాణించిన అతను.. సెమీఫైనల్లో ఇంగ్లండ్పై చేతులెత్తేశాడు. వేసిన 2 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా 25 పరుగులు ఇచ్చాడు. అయినా అతనికి మద్దతుగా నిలిచిన టీం మేనేజ్మెంట్.. న్యూజిల్యాండ్తో టీ20 సిరీస్కు కూడా అతన్ని సెలెక్ట్ చేసింది. ఇక్కడ రెండు టీ20లు ఆడిన అతను రెండో టీ20లో 12 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకోగా.. మూడో మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా లేకుండా 35 పరుగులు ఇచ్చాడు. ఇకనైనా అతన్ని పక్కనపెట్టేయాలని, దీపక్ చాహర్కు సెలెక్టర్లు పెద్ద పీట వేయాలని పాకిస్తాన్ మాజీ లెజెండ్ దానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు.
భువీ కన్నా చాహర్ బెస్ట్..
భువనేశ్వర్ కన్నా కూడా దీపక్ చాహర్ మెరుగైన ఆటగాడని కనేరియా అన్నాడు. భువీని పక్కన పెట్టి వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసమైనా చాహర్కు అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ సూచన చేశాడు. 'వచ్చే టీ20 వరల్డ్ కప్ జరగడానికి రెండేళ్ల సమయం ఉంది. అప్పటి వరకు భువనేశ్వర్ ఫిట్గా, ఫామ్లో ఉంటాడా? నాకు అలా అనిపించడం లేదు. భువనేశ్వర్ కన్నా చాహర్ మెరుగైన ఆటగాడని నా ఫీలింగ్. అతనికి టీ20ల్లో అవకాశాలు ఇవ్వాలి' అని చెప్పాడు.
అలాంటి బౌలర్ అవసరమా?
భువనేశ్వర్ పేలవమైన ప్రదర్శనను ఎత్తి చూపిన కనేరియా.. 'నాలుగు ఓవర్లు వేసి 35-40 పరుగులు ఇచ్చే బౌలర్ జట్టుకు అవసరమా? ఇకనైనా కళ్లు తెరిచి భువనేశ్వర్ను పక్కన పెట్టేయడం మంచిది. ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్ వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు. కాకపోతే నటరాజన్ ఎడం చేతి వాటం పేసర్.. ప్రస్తుతానికి అర్షదీప్ సింగ్ ఈ పాత్రను చక్కగా పోషిస్తున్నాడు' అని చెప్పాడు. కివీస్తో టీ20 సిరీస్కు భువనేశ్వర్ను ఎంపిక చేసిన సెలెక్టర్లు.. వన్డే సిరీస్లో అతన్ని పక్కనపెట్టేసి చాహర్కు అవకాశం ఇచ్చారు. ఆక్లాండ్లో మొదలయ్యే మొదటి వన్డేలో చాహర్ కూడా ఆడటం దాదాపు గ్యారంటీనే.