ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం:
అహ్మదాబాద్లోని మొతెరా స్టేడియంకు సంబంధించిన ఓ ఫొటోను మంగళవారం బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. స్టేడియం తాలూకు ఏరియల్ వ్యూ చిత్రాన్ని ట్విటర్లో పోస్ట్ చేసింది. 'భారత్లోని అహ్మదాబాద్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. దీని సీటింగ్ సామర్థ్యం 1.10లక్షలు' అని బీసీసీఐ కాప్షన్ రాసుకొచ్చింది. బీసీసీఐ ఈ స్టేడియం ఏరియల్ వ్యూ ఫొటోలను షేర్ చేసిన వెంటనే వైరల్ అయ్యాయి.
నమస్తే ట్రంప్:
ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం మొతేరా స్టేడియం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ట్రంప్ పాల్గొనే అవకాశం ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తాజాగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 'నమస్తే ట్రంప్' పేరుతో ట్రంప్, మొదటి మహిళ మెలానియా ట్రంప్కు మొతేరాలో ఘనంగా ఆహ్వానం పలకునున్నారు.
ఎగ్జిబిషన్ మ్యాచ్కు మొతేరా ఆతిథ్యం:
ఈ ఏడాది చివర్లో ఆసియా ఎలెవన్-ప్రపంచ ఎలెవన్ జట్ల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్కు మొతేరా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ స్టేడియం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కన్నా పెద్దది కావడం విశేషం. సర్దార్ పటేల్ స్టేడియంలో సీటింగ్ సామర్థ్యం ఏకంగా 1,10,000 కావడం గమనార్హం. ఎంసీజీ 90 వేల సీటింగ్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా రికార్డులకెక్కింది. ఇప్పుడా ఆ రికార్డు సర్దార్ పటేల్ స్టేడియం సొంతం కానుంది.
ఎంసీజీకి మించిన సామర్థ్యం:
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) ఉపాధ్యక్షుడు పరిమళ్ నత్వానీ గత జనవరిలో ఈ స్టేడియానికి సంబంధించిన కొన్ని ఫొటోలను పోస్టు చేశాడు. అయితే అప్పటికి స్టేడియం నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఎంసీజీకి మించిన సామర్థ్యం ఈ స్టేడియం సొంతమని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు బీసీసీఐ స్టేడియం పనులు, సామర్థ్యాన్ని వివరించింది.