ధోనీ రికార్డు సమం:
ఇప్పటి వరకు 98 టీ20లు ఆడిన ధోనీ అత్యధిక మ్యాచ్లు ఆడిన భారత ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా రోహిత్ ఆ రికార్డును సమం చేశాడు. ప్రస్తుతం రోహిత్ కూడా 98 టీ20లు ఆడాడు. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో సురేశ్ రైనా (78), కెప్టెన్ విరాట్ కోహ్లీ (72) అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.
ఆస్ట్రేలియాపై చివరి టీ20:
98 టీ20లు ఆడిన ధోనీ 1,617 పరుగులు చేశాడు. అదే 98 టీ20లు ఆడిన రోహిత్ 2,443 పరుగులు చేసాడు. మూడో టీ20లో రోహిత్ (9) త్వరగానే పెవిలియన్ చేరిన విషయం తెలిసిందే. రెండో టీ20లో కూడా 12 పరుగులు మాత్రమే చేసాడు. మరోవైపు ధోనీ తన చివరి టీ20 మ్యాచ్ను ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాపై ఆడాడు. ప్రపంచకప్ అనంతరం విరామం తీసుకుంటున్న ధోనీ.. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు అందుబాటులో లేని విషయం తెలిసిందే.
కోహ్లీ@1
అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు జాబితాలో విరాట్ కోహ్లీ (2,450) తన అగ్రస్థానంను నిలబెట్టుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లీ తర్వాత స్థానంలో రోహిత్ శర్మ ( 2,443 ) ఉన్నాడు. అయితే దక్షిణాఫ్రికాతో మూడో టీ20 ప్రారంభానికి ముందు కోహ్లీ రికార్డును రోహిత్ సవరించి మళ్లీ అగ్రస్థానానికి చేరతాడని అందరూ ఊహించారు. అయితే రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే నిరాశ పరిచాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ కూడా విఫలమయ్యాడు. ప్రస్తుతం ఇద్దరి మధ్య కేవలం 7 పరుగుల అంతరం మాత్రమే ఉంది.
సిరీస్ సమం:
దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. మరోవైపు బ్యాట్స్మెన్ పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులే చేసింది. శిఖర్ ధావన్ (36) టాప్ స్కోరర్. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆదినుంచే భారత బౌలర్లపై విరుచుకుపడింది. కెప్టెన్ డికాక్ (79 నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉంది సునాయసంగా విజయాన్ని అందించాడు. ఈ విజయంతో ప్రొటీస్ మూడు మ్యాచ్ల టీ20ల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.