

హైదరాబాద్: టీ20ల్లో నాలుగో సెంచరీ.. కెప్టెన్గా మరో సిరీస్ విజయం. పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు.. ఓ క్యాలెండర్ ఏడాది(2018)లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్గా తన పేరిట ఉన్న రికార్డును తానే బద్దలు కొట్టాడు. లక్నో స్టేడియం వేదికగా రెచ్చిపోయిన రోహిత్ శర్మ.. టీమిండియాకు టీ20 సిరీస్ గెలుపును ఖాయం చేశాడు.
ఎంతో సులభంగా సిక్సర్లు, ఫోర్లతో మొత్తంగా విండీస్ బౌలర్లను హడలెత్తిస్తూ హిట్మ్యాన్(111నాటౌట్; 61బంతుల్లో 8ఫోర్లు, 7సిక్సులు)లతో ధాటిగా సెంచరీ చేసి రెండో టీ20లో భారత జట్టు వెస్టిండీస్ను చిత్తు చిత్తుగా ఓడించింది. అనంతర బౌలర్లు కూడా తిప్పేయడంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ భారత్ 2-0తో కైవసం అయింది. ఈ సందర్భంగా పలువురు క్రీడా ప్రముఖులు ట్విటర్ వేదికగా రోహిత్ శర్మను అభినందించారు. వాటిలో కొన్ని..
'అద్భుత ఆటతో వెస్టిండీస్పై సిరీస్ విజయాన్ని నమోదు చేసుకున్న రోహిత్ సేనకు ప్రత్యేక అభినందనలు.'
'ఇది నీ రోజు. ఈ రోజు మొత్తంలో ఎలాంటి తప్పిందం చేయకుండా.. మెరుపు శతకంతో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. బౌలింగ్లో చక్కటి మార్పులతో.. అద్భుత క్యాచ్లతో పూర్తిగా రెండో టీ20 సాఫీగా సాగిపోయింది.'
'చక్కటి క్యాచ్లు అందుకొని.. మ్యాచ్ను ముందుండి నడిపించిన రోహిత్ శర్మకు అభినందనలు.'
'ప్రతి ఒక్క బంతిని ఊచకోత కోయడం కేవలం రోహిత్కు మాత్రమే సాధ్యం'
'టీ20ల్లో నాలుగో శతకంతో రోహిత్ శర్మ లఖ్నవూలో అప్పుడే దీపావళి టపాసులు పేల్చేశాడు'
'అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో నాలుగు శతకాలు బాదిన తొలి బ్యాట్స్మెన్ రోహిత్శర్మకు అభినందనలు.'