
హైదరాబాద్: 19 ఏళ్ల పాటు భారత క్రికెట్కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు క్రికెటర్లు, మాజీలు యువీ రిటైర్మెంట్పై స్పందించగా... తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా యువీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ సందర్భంగా షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానల్లో యువరాజ్ సింగ్తో తన తొలి పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు. అక్తర్ మాట్లాడుతూ "రాక్ స్టార్, మ్యాచ్ విన్నర్, గ్రేట్ జూనియర్. మంచి స్నేహితుడు యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. యువీతో ఆడిన తొలి మ్యాచ్ నాకు ఇప్పటికీ గుర్తే" అని అన్నాడు.
"సెంచూరియన్లో అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత అతడితో మాట్లాడాను. మనం మైదానంలో గడిపిన క్షణాలు అద్భుతమైనవి. అద్వితీయమైన కెరీర్ను సాగించినందుకు నీకు అభినందనలు. అంతర్జాతీయ క్రికెట్కు ఒక మ్యాచ్ విన్నర్ దూరమయ్యాడు. అతనో అద్భుతమైన ప్లేయర్" అని షోయబ్ అక్తర్ తెలిపాడు.
అనంతరం అక్తర్ ట్వీట్పై యువరాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. యువీ తన ట్విట్టర్లో "నీ అందమైన విషెస్కు ధన్యవాదాలు. నీవు వేసిన ప్రతీ బంతిని నేను ఆస్వాదించా. నిన్ను ఎదుర్కోవడానికి చాలా ధైర్యాన్ని కూడగట్టుకునే వాడ్ని. మన మధ్య జరిగిన క్రీడా యుద్ధం ఎప్పటికీ పదిలమే. ఆ క్షణాలు ఎప్పటికీ మధురమే" అని అక్తర్కు రిప్లై ఇచ్చాడు.