చివరిసారిగా నాగ్పూర్లో..
భారత క్రికెట్ జట్టు 2015 నాటి ప్రపంచకప్ టోర్నమెంట్లో అన్ని లీగ్ మ్యాచుల్లో జయకేతనాన్ని ఎగురవేసిన విషయం తెలిసిందే. సెమీస్లో ఓటమి పాలైనప్పటికీ.. లీగ్ దశలో భారత జట్టు ఎదురు లేకుండా దూసుకెళ్తోంది. చివరిసారిగా 2011 నాటి ప్రపంచకప్లో భాగంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లో విదర్భ క్రికెట్ గ్రౌండ్స్లో లీగ్ దశలో ఓటమిని ఎదుర్కొంది. ఆ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. అదే చివరిది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత క్రికెట్ జట్టు 48.4 ఓవర్లలో 296 పరుగులు చేసింది. ఓపెనర్గా వెళ్లిన సచిన్ టెండుల్కర్ సెంచరీ చేసిన మ్యాచ్ అది. 101 బంతుల్లో మూడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో సచిన్.. 111 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అదే మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ 73, గౌతమ్ గంభీర్ 69 పరుగులు చేశారు. ఆ తరువాత బ్యాట్స్మెన్లెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. చేతిలో ఇంకా మూడు వికెట్లు ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. 49.4 ఓవర్లలో 300 పరుగులు చేసింది.
అదే చివరిది..
ప్రపంచకప్ టోర్నమెంట్లో లీగ్ దశలో టీమిండియా ఓటమి పాలు కావడం అదే చివరిది. ఆ మ్యాచ్ తరువాత లీగ్ దశలో అన్నింటినీ గెలుస్తూ వస్తోంది. 2015 ప్రపంచకప్లో కూడా ఆడిన అన్ని లీగ్ మ్యాచులనూ గెలుచుకుంది భారత్. ప్రస్తుత ప్రపంచకప్ టోర్నమెంట్లో సౌతాంప్టన్లోని రోజ్బౌల్ స్టేడియంలో ఆఫ్ఘన్తో జరిగిన మ్యాచ్ వరకు వరుసగా.. 11 లీగ్ మ్యాచులను గెలుచుకుంది. ఇందులో- ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 1999 నుంచి 2011 వరకు జరిగిన ప్రపంచకప్ టోర్నమెంట్లలో ఆస్ట్రేలియా జట్టు లీగ్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మొత్తం 13 మ్యాచులను గెలుచుకుంది. 11 మ్యాచులతో టీమిండియా రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా జట్లు పదేసి చొప్పున విజయాలతో నాలుగు, అయిదు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
2015 నుంచి ఇప్పటిదాకా
2015 ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి తాజాగా మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో వెస్టిండీస్ వరకు లీగ్ దశల్లో ఒక్క మ్యాచ్ను కూడా ఓడిపోలేదు న్యూజీలాండ్. ఇలా మొత్తం 10 మ్యాచ్లలో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే రికార్డు దక్షిణాఫ్రికా పేరు మీద కూడా ఉంది. 1992 నుంచి 1999 ప్రపంచకప్ వరకు ఒక్క లీగ్ మ్యాచ్ను కూడా దక్షిణాఫ్రికా తన ప్రత్యర్థికి కోల్పోలేదు. మొత్తం 10 మ్యాచుల్లో ఆ జట్టు విజయం సాధించింది.