
మెల్బోర్న్: కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తూ వస్తోన్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో మ్యాచ్ పోటాపోటీగా మారింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో బ్లాక్ బస్టర్ మ్యాచ్ కావడం వల్ల అందరి దృష్టీ దీని మీదే ఉంది. ఈ మ్యాచ్కు ఉన్నంత క్రేజ్ మరే దానికీ ఉండట్లేదు. అందుకే బాక్సులు బద్దలవుతున్నాయి.
టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ తడబడుతోంది. 14 ఓవర్లల్లో నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇద్దరు ఓపెనర్లు తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. బాబర్ ఆజమ్ది గోల్డెన్ డకౌట్. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడీ కేప్టెన్ కమ్ ఓపెనర్. తోటి ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా విఫలం అయ్యాడు. నాలుగు పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. ఇఫ్తికర్ అహ్మద్-51, షాన్ మసూద్-31 పరుగులు చేయడంతో కోలుకున్నట్టు కనిపించినా.. హార్దిక్ పాండ్యా దెబ్బకొట్టాడు.
సాధారణంగా భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చాలా అరుదుగా జరుగుతుంటుంది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే దీనికి కారణం. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఇలాంటి బిగ్గెస్ట్ ఈవెంట్లల్లో తప్ప ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లు ఉండవు. అలాంటిది ఈ రెండు నెలల వ్యవధిలో ఈ రెండు దేశాలు తలపడబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన ఆసియా కప్ 2022 తరువాత రెండు నెలల వ్యవధిలో మళ్లీ భారత్ - పాకిస్తాన్ ఢీకొడుతున్నాయి.
ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా లక్ష మందికి పైగా వీక్షిస్తోన్నారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ పూర్తి సామర్థ్యం లక్ష. లక్షమంది ఒకేసారి మ్యాచ్ను తిలకించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా టికెట్లు అమ్ముడయ్యాయి. 90 వేలకు పైగా టికెట్లను విక్రయించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అదే సమయంలో ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద కూడా రికార్డు స్థాయిలో వీవర్స్ ఉన్నారీ మ్యాచ్కు. హాట్స్టార్పై ఏకంగా కోటీ 10 లక్షల మంది మ్యాచ్ను తిలకిస్తోన్నారు. ఇదో రికార్డు.
డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో లైవ్ టెలికాస్ట్ అవుతోందీ మ్యాచ్. భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అనగానే ఏ రకంగానైతే భావోద్వేగాలు కనిపిస్తుంటాయో.. ఇప్పుడూ అలాంటి పరిస్థితే ఉంది. లక్ష మంది ప్రేక్షకులు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్కు చేరుకోవడం- అందులో మెజారిటీ ఫ్యాన్స్ టీమిండియాకు మద్దతు ఇస్తోండటంతో స్టేడియం మొత్తం రచ్చరచ్చగా మారింది.