
హైదరాబాద్: ఆటగాళ్లకు విశ్రాంతి లేకుండా బీసీసీఐ వరుస క్రికెట్ సిరిస్లను నిర్వహిస్తోందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మద్దతుగా నిలిచాడు. కశ్మీర్ బరాముల్లా జిల్లాలోని కంజెర్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించిన చినార్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్కు ధోని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ధోని మీడియాతో మాట్లాడుతూ ఇటీవలికాలంలో క్రికెట్ ఆడటం బాగా ఎక్కువైపోయిందని ఆయన అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా వంటి విదేశీ సిరీస్లు ఆడాలంటే ఆటగాళ్లకు తగినంత సమయం కావాలని సూచించాడు. అయితే, ఇలాంటి సవాల్ను ప్రతి అంతర్జాతీయ క్రికెటర్ ఎదుర్కోక తప్పదని అన్నాడు.
'కోహ్లీ వ్యాఖ్యలకు నూటికి నూరుశాతం సరైనవే. మేం విపరీతంగా క్రికెట్ ఆడుతున్నాం. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు మాకు తగినంత సమయం శిక్షణ కోసం దొరకడం లేదు. ప్రస్తుత జట్టులో చాలామందికి విదేశాల్లో ఆడిన అనుభవం ఉంది. వీరికి కనీసం ఆరు నుంచి పది రోజులు సమయం దొరికినా.. కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేస్తారు. కానీ, ఒక అంతర్జాతీయ క్రికెటర్గా ఈ సవాల్ను ఎదుర్కోవాల్సిందే' అని ధోని అన్నాడు.

భారత్-పాక్ల మధ్య క్రికెట్ ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలా? అన్న ప్రశ్నకు ధోని తనదైన శైలిలో స్పందించాడు. ఇది ప్రభుత్వ నిర్ణయానికి వదిలేయడమే మంచిదని చెప్పాడు. దాయాదుల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. అది క్రీడ కన్నా ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుంటుందని, దీనిని పెద్ద విషయంగా పరిగణిస్తారని అన్నారు.
భారత్-పాక్ మ్యాచ్ అంటే అది దౌత్యపరంగా, రాజకీయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కాబట్టి ప్రభుత్వానికే ఈ విషయాన్ని వదిలేయాలని ధోని చెప్పుకొచ్చాడు. ఈ క్రికెట్ మ్యాచ్కి ధోని లెప్టెనెంట్ కల్నల్ హోదాలో హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలువురు ధోనితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.