బెంగుళూరు: సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం ఆస్టేలియా క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్, టీమిండియా స్ఫిన్నర్ హార్భజన్ సింగ్ల మధ్య చోటు చేసుకున్న 'మంకీగేట్' వివాదాన్ని అప్పటి ఆసిస్ కెప్టెన్ రికీ పాంటింగ్తో కలిసి తానే రాజీ కుదర్చినట్లు టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తెలిపాడు.
తామిద్దరం కలిసి కూర్చోని ఆ వివాదాన్ని పెద్దది కాకుండా రాజీ చేశామని శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. 2008లో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో ఆసిస్ బ్యాట్స్మెన్ ఆండ్రూ సైమండ్స్, టీమిండియా స్ఫిన్నర్ హార్భజన్ సింగ్ తనను 'మంకీ' అని హేళన చేశాడని అతని జాత్యహంకారానికి ఇది నిదర్శనమని అప్పట్లో మ్యాచ్ రిఫరీకి సైమండ్స్ ఫిర్యాదు చేశాడు.

దీంతో, సానుకూలంగా స్పందించిన రిఫరీ మైక్ ప్రోక్టర్ మూడు మ్యాచ్ల నుంచి హర్భజన్ సింగ్ను సస్పెండ్ చేశాడు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఒత్తిడి తీసుకురాగా, సచిన్ టెండూల్కర్ జోక్యం చేసుకొని భజ్జీ తప్పు ఏమీ లేదని వాదించాడు. దీంతో భజ్జీపై విధించిన సస్పెన్షన్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) రద్దు చేసింది.
దిలీప్ సర్దేశాయ్ స్మారక ప్రసంగం సందర్భంగా శనివారమిక్కడ కుంబ్లే తన కెప్టెన్సీలో 2008లో ఆస్టేలియా పర్యటనలో తీవ్ర వివాదమైన 'మంకీగేట్'ను కూడా గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్లు హర్భజన్కు అండగా నిలిచారన్నాడు.
క్రికెట్ జట్టు కెప్టెన్లకు పరిణితితో కూడిన దూకుడు మాత్రమే ఉండాలని తన అభిప్రాయంగా కుంబ్లే తెలిపాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆకస్మికంగా జరిగే ఘటనలపై కెప్టెన్ ఆచితూచి వ్యవహరించాలన్నాడు. వివిధ ఫార్మాట్లకు వేరు వేరు కెప్టెన్లు ఉండడం పెద్ద సమస్య కాబోదని కుంబ్లే అన్నాడు.