అంతర్జాతీయ క్రికెట్లో పసికూనల పోరులో సంచలన రికార్డు నమోదైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆసియా క్వాలిఫయిర్-ఏలో భాగంగా సింగపూర్తో జరిగిన మ్యాచ్లో మంగోలియా 10 పరుగులకే కుప్పకూలింది. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా మంగోలియా చెత్త రికార్డు నమోదు చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన మంగోలియా జట్టు పది ఓవర్లు పాటు బ్యాటింగ్ చేసి పది పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం. అయిదుగురు డకౌటయ్యారు. నలుగురు ఆటగాళ్లు ఒక్క పరుగుకే పరిమితమయ్యారు. ఇక ఇద్దరు ఆటగాళ్లు రెండు పరుగులు చేశారు. రెండు పరుగులు ఎక్స్ట్రా రూపంలో వచ్చాయి. సింగపూర్ బౌలర్లలో హర్ష భరద్వాజ్ ఆరు వికెట్లు పడగొట్టాడు.

హర్ష నాలుగు ఓవర్లు వేసి మూడు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు సాధించారు. ఇందులో రెండు ఓవర్లు మెయిడిన్ చేశాడు. అక్షయ్ రెండు వికెట్లు, రాహుల్, రమేశ్ చెరో వికెట్ తీశారు. అనంతరం ఛేదనకు దిగిన సింగపూర్ తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచింది. ఒక్క వికెట్ కోల్పోయి అయిదు బంతుల్లోనే లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్ మన్ప్రీత్ సింగ్ గోల్డెన్ డకౌటవ్వగా, సింప్సన్ (6 నాటౌట్; 2 బంతుల్లో, 1 ఫోర్), శర్మ (7 నాటౌట్, 2 బంతుల్లో, 1 సిక్సర్) జట్టును విజయతీరాలకు చేర్చారు.
మంగోలియాపై ప్రపంచ రికార్డులు నమోదవ్వడం ఇది మొదటిసారి కాదు. టీ20ల్లో అత్యల్ప స్కోరు సాధించిన మంగోలియా.. అత్యధిక పరుగులు సమర్పించుకున్న జట్టుగానూ గతంలో రికార్డులకెక్కింది. మంగోలియాతో జరిగిన మ్యాచ్లో నేపాల్ మూడు వికెట్లు కోల్పోయి 314 పరుగులు సాధించడం గమనార్హం. దీంతో మంగోలియా పేరిట అత్యల్ప స్కోరు, అత్యధిక స్కోరు ఇచ్చిన జట్టుగా రికార్డులకెక్కింది. స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు కూడా పది పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం.