
హైదరాబాద్: పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) భాగంగా పాక్ గడ్డపై జరగబోయే ప్లే ఆఫ్ మ్యాచ్లు ఆడేందుకు విదేశీ క్రికెటర్లు ఆసక్తి చూపకపోవడంపై ఆ దేశ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనికి కారణం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)యే కారణమని తెలిపాడు.
పీఎస్ఎల్ మూడో సీజన్లో భాగంగా లీగ్ మ్యాచ్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరగ్గా, ప్లే ఆఫ్ మ్యాచ్లు మాత్రం పాకిస్తాన్లో జరుగుతున్నాయి. అయితే పాక్ గడ్డపై నిర్వహిస్తోన్న ఈ మ్యాచ్లు ఆడేందుకు పలువురు విదేశీ క్రికెటర్లు అంగీకరించగా, మరికొందరు మాత్రం నిరాకరించారు.
దీనిపై మొయిన్ ఖాన్ మాట్లాడుతూ 'ఇటువంటి బాధాకర పరిస్థితికి మా క్రికెట్ బోర్డు పెద్దలే కారణం. పాకిస్తాన్లో విదేశీ ఆటగాళ్లు ఆడితేనే పీఎస్ఎల్లో ఆడటానికి అనుమతించాలి. మా బోర్డు మాత్రం లీగ్లో పాల్గొనే ఆటగాళ్లకు ఎటువంటి ఆంక్షలు విధించలేదు. అందుకే పాక్లో జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లకు విదేశీ ఆటగాళ్లు వచ్చేందుకు నిరాకరించారు' అని అన్నాడు.
'మా బోర్డుకు నా మాటలు నచ్చకపోవచ్చు. భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటే పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి, పీఎస్ఎల్ పరిస్థితి దారుణంగా మారుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పాకిస్తాన్లో క్రికెట్ను బ్రతికించుకునేందుకు పీసీబీ సీరియస్గా దృష్టి సారించాలి' అని మొయిన్ ఖాన్ ఆవేదన వ్కక్తం చేశాడు.
పీఎస్ఎల్లో ఇప్పటివరకు లీగ్ మ్యాచ్లను యూఏఈలో నిర్వహించగా... రెండు ప్లే ఆఫ్ మ్యాచ్లకు లాహరో ఆతిథ్యం ఇస్తుండగా... ఫైనల్ మ్యాచ్ కరాచీ వేదికగా జరగనుంది. పాక్ తరుపున 69 టెస్టులు, 219 వన్డేలాడిన మొయిన్ ఖాన్ ప్రస్తుతం పీఎస్ఎల్లో క్వెటా గ్లాడియేటర్స్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు.