IND vs PAK: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య నేడు(ఆదివారం) జరగనున్న ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ కంటే ముందే పెద్ద వివాదం మొదలయ్యే అవకాశం ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్( ఛైర్మన్), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ అయిన మొహ్సిన్ నఖ్వీ ఫైనల్కు హాజరు కావడానికి దుబాయ్కు చేరుకున్నారు. సాధారణంగా ఏసీసీ ఛైర్మన్గా మొహ్సిన్ నఖ్వీ విజేత జట్టుకు ట్రోఫీని అందజేస్తారు. అయితే మొహ్సిన్ నఖ్వీ ఇటీవల భారత్కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు, పక్షపాత వైఖరి కారణంగా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ వేడుకలో భారత జట్టు పాల్గొనకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మొహ్సిన్ నఖ్వీతో వేదిక పంచుకోవడానికి భారత్ నిరాకరణ?
మొహ్సిన్ నఖ్వీ తరచుగా భారత్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తూ.. పీసీబీ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తూ.. ఏసీసీ ఛైర్మన్గా తన బాధ్యతలను విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి. టీమిండియా ఇప్పటికే పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం (హ్యాండ్షేక్) చేయడానికి నిరాకరించింది. తాజా నివేదికల ప్రకారం, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ప్రెజెంటేషన్ వేడుకను బహిష్కరించి, నఖ్వీతో వేదిక పంచుకోవడానికి ఇష్టపడకపోవచ్చు."ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆయన ఈ రోజు సాయంత్రం వస్తారు. ఏసీసీ ఛైర్మన్ హోదాలో విజేతకు ట్రోఫీని అందజేయడం ఖాయం. బీసీసీఐ (BCCI) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి" అని ఓ టోర్నమెంట్ అంతర్గత వ్యక్తి చెప్పారు.

మొహ్సిన్ నఖ్వీ ఇటీవల ఒక సందర్భంలో.. సందర్భం లేకుండా క్రిస్టియానో రొనాల్డో వీడియోను పోస్ట్ చేసి, భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చివేసిన పాత వాదనను పరోక్షంగా ప్రస్తావించి భారత్ను ఎగతాళి చేశారు.
సూపర్ 4 మ్యాచ్లో వివాదాలు.. జరిమానాలు
ఇప్పటికే సూపర్ 4 మ్యాచ్లో అనేక వివాదాలు జరిగాయి. హారిస్ రౌఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ భారత అభిమానులను రెచ్చగొట్టేలా అభ్యంతరకరమైన సైగలు చేశారు. ఫర్హాన్ 'గన్ సెలబ్రేషన్' చేయగా.. రౌఫ్'6-0' అని సైగ చేశాడు.ఈ చర్యలకు గానూ ఐసీసీ రౌఫ్పై 30 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించగా, ఫర్హాన్కు మందలింపు ఇచ్చింది.గ్రూప్ స్టేజ్ మ్యాచ్ తర్వాత రాజకీయ ప్రకటన చేసినందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై కూడా 30 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించారు. సూర్యకుమార్ తమ విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు అంకితం చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ, ఫైనల్లో టీమిండియా నిజంగానే ట్రోఫీని మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా అందుకోకుండా బహిష్కరిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది.