న్యూఢిల్లీ: ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం అడిలైడ్ ఓవల్లో పాకిస్థాన్తో జరగనున్న మ్యాచులో టీమిండియా తప్పక విజయం సాధిస్తుందని భారత మాజీ ఆటగాడు మోహిందర్ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశాడు. వన్డే క్రికెట్లో టీమిండియా కంటే బలంగా కనిపిస్తున్నప్పటికీ ప్రపంచ కప్ టోర్నీలో భారత్పై పాకిస్థాన్ గెలవలేదని అన్నాడు.
ఇప్పటి వరకు జరిగిన ఐదు ప్రపంచ కప్ టోర్నీలో కూడా టీమిండియాతో జరిగిన మ్యాచుల్లో పాకిస్థాన్ ఎప్పుడూ గెలవలేదని చెప్పాడు. మొహాలీలో జరిగిన గత ప్రపంచ కప్ టోర్నీలో కూడా పాకిస్థాన్ ఓటమి పాలైందని గుర్తు చేశాడు.
'రెండు జట్లలో పెద్ద తేడాలు ఏమి లేవు. రెండు జట్లలో మంచి ఆటగాళ్లున్నారు. అయితే నేను రికార్డులను నమ్ముతాను. ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ మ్యాచులో టీమిండియా ఎప్పుడైనా బాగా రాణిస్తుంది. అయితే ఈసారి పాక్ జట్టుపై టీమిండియా గెలిస్తే అది బ్యాట్స్మెన్దే తప్ప.. బౌలర్లది కాదు' అని అమర్నాథ్ చెప్పాడు.

కాగా, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లేకుండా పాకిస్థాన్ జట్టుతో టీమిండియా తలపడటం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. 2012లో వన్డే అంతర్జాతీయ క్రికెట్కు సచిన్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు 1992, 1996, 1999, 2003, 2011 ప్రపంచకప్ పోటీల్లో పాకిస్థాన్ మీద ఆడాడు.
'సచిన్ టెండూల్కర్ గొప్ప ఆటగాడైనప్పటికీ రిటైర్మెంట్ ఇవ్వక తప్పలేదు. అయితే అతని స్థానాన్ని భర్తీ చేయలేం. సచినే కాదు.. రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వివిఎస్ లక్ష్మణ్, యువరాజ్ సింగ్ లాంటి ఆటగాళ్లతో సరిపోయేవాళ్లు కూడా లేరు' అని 1983 ప్రపంచ కప్ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికైన మోహిందర్ అమర్నాథ్ తెలిపాడు.