టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ను జట్టును నుంచి విడుదల చేశామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. రెండో టెస్టు ముందు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపింది. సిరాజ్ స్థానంలో అవేశ్ ఖాన్ జట్టులోకి తిరిగొచ్చాడని పేర్కొంది. వైజాగ్ వేదికగా ఇవాళ నుంచి భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టు ఆడుతున్న విషయం తెలిసిందే. టాస్ సమయంలో రోహిత్ సిరాజ్ గురించి స్పందిస్తూ అతడికి విశ్రాంతి ఇచ్చామని తెలిపాడు. అతడి స్థానంలో ముకేశ్ కుమార్ జట్టులోకి వచ్చాడని అన్నాడు.
అయితే సిరాజ్కు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరమేంటని, ఒక్క టెస్టుకే రెస్ట్ ఏంటని అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సిరాజ్ విషయంపై స్పష్టత ఇచ్చింది. ఇంగ్లాండ్తో అయిదు టెస్టుల సుదీర్ఘమైన సిరీస్ను, ఇటీవల సిరాజ్ విరామం లేని క్రికెట్ ఆడటాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

''వైజాగ్ టెస్టుకు భారత జట్టు నుంచి మహ్మద్ సిరాజ్ను విడుదల చేస్తున్నాం. సుదీర్ఘమైన సిరీస్, అతడు ఇటీవల ఆడిన క్రికెట్ను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. రాజ్కోట్ వేదికగా జరిగే మూడో టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడు. అతడి స్థానంలో రెండో టెస్టుకు అవేశ్ ఖాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు'' అని బీసీసీఐ ట్వీట్ చేసింది. కాగా, తొలి టెస్టులో సిరాజ్ వికెట్ సాధించని విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్లో నాలుగు ఓవర్లే అతడితో బౌలింగ్ చేయించారు. రెండో ఇన్నింగ్స్లో సిరాజ్ ఏడు ఓవర్లు మాత్రమే వేశాడు.
ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టులకు భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. చివరి మూడు టెస్టులకు టీమిండియాను ఎంపిక చేయలేదు. అయితే తొలి టెస్టులో గాయపడిన కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. రవీంద్ర జడేజా ఫిట్నెస్పై ఇంకా స్పష్టత లేదు. మరోవైపు వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్ వేదికగా మూడో టెస్టు జరగనుంది. రాంచీ, ధర్మశాల వేదికగా చివరి రెండు టెస్టులు జరగనున్నాయి.