
హైదరాబాద్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకొని గురువారం ఉదయం హైదరాబాద్ వచ్చిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్.. నేరుగా తన తండ్రి సమాధి దగ్గరికి వెళ్లి ప్రార్థించాడు. తన తండ్రి సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి.. ప్రార్థించాడు. ఈ సందర్భంగా తన తండ్రి కలను నిజం చేసే అవకాశం దక్కినందుకు తాను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటానని 26 ఏళ్ల సిరాజ్ అన్నాడు. సిరాజ్ ఆస్ట్రేలియా టూర్లో ఉన్న సమయంలోనే అతని తండ్రి మొహ్మద్ గౌస్ మరణించిన విషయం తెలిసిందే.
తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం తిరిగి ఇండియాకు వెళ్లిపోవచ్చని బీసీసీఐ మొహ్మద్ సిరాజ్కు అవకాశం కల్పించింది. కానీ సిరాజ్ మాత్రం అంతటి విషాదంలోనూ టీమ్తోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి కలను నెరవేర్చాలనే ఆశయంతో ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. తండ్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లాడన్న దుఃఖాన్ని దిగమింగుకొని టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణించాడు. చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసి సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈరోజు హైదరాబాద్ చేరుకొని.. తన తండ్రి సమాధి దగ్గరికి వెళ్లి ప్రార్థించాడు.
సిరాజ్ ఈ ఉదయం 9 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. విమానాశ్రయం నుంచి సిరాజ్ టోలిచౌక్లోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. సాయంత్రం 5 గంటలకు అతడు మీడియాతో మాట్లాడనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన అనుభవాలను పంచుకోనున్నాడు.
మొహ్మద్ సిరాజ్ 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. దేశీవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్ 2020లోనూ మెరుగ్గా రాణించిన సిరాజ్.. ఆసీస్ సిరీస్కు ఎంపికయ్యాడు. సిరాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున ఒక వన్డే, మూడు టీ20లు, మూడు టెస్టులు ఆడాడు. టెస్టుల్లో 13, టీ20ల్లో 3 వికెట్లు పడగొట్టాడు. వీవీఎస్ లక్ష్మణ్ (1996) తర్వాత హైదరాబాద్లో పుట్టి, టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రికెటర్ మొహ్మద్ సిరాజే కావడం విశేషం.