టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ జీవితంలో గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలు సినిమా స్క్రిప్ట్ను తలపిస్తున్నాయి. గతేడాది కాలంగా టీ20 ఫార్మాట్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ ఏడాది జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో తాను భాగం అవుతానని మహ్మద్ సిరాజ్ కనీసం ఊహించలేదు. ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్లో అనూహ్యంగా చోటు దక్కించుకున్న అద్భుతంగా రాణించిన సిరాజ్.. తన సెలెక్షన్ వెనుక ఉన్న అసలు కథను బయటపెట్టాడు. అసలు తాను వరల్డ్ కప్ ఆడతానని అస్సలు ఊహించలేదని.. అంతా దేవుడి దయ అని మహ్మద్ సిరాజ్ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు. అది తనకు రాసిపెట్టుందని మియా భాయ్ చెప్పుకొచ్చాడు.
దెబ్బకు ఆ ప్లాన్లన్నీ మారిపోయాయి..
మహమ్మద్ సిరాజ్ గత ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో, ఈసారి ప్రపంచకప్లో ఉంటానని ఆశలు వదులుకున్నారు. ఫిబ్రవరి 15న రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ మ్యాచ్ చూడాలని, ఆపై రంజాన్ నెలలో కుటుంబంతో గడపాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ హర్షిత్ రాణా గాయపడటం సిరాజ్ కెరీర్ను మలుపు తిప్పింది.

సిరాజ్ అదృష్టాన్ని మార్చిన సూర్య ఫోన్ కాల్!
అమెరికాపై అద్భుత స్పెల్ తర్వాత మహ్మద్ సిరాజ్ మాట్లాడుతూ తన ఎంపిక గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. "నేను ఇంట్లో కుటుంబంతో గడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (సూర్య భాయ్) నుంచి కాల్ వచ్చింది. 'మియా.. రెడీ అయిపో, నీ బ్యాగ్ ప్యాక్ చేసుకుని వెంటనే వచ్చేయ్' అని చెప్పారు. అది విన్న నేను షాక్ అయ్యాను. 'సూర్య భాయ్.. నాతో జోకులు వేయకండి' అని అన్నాను. కానీ ఆయన ఇది నిజం అని చెప్పడంతో నా ఆశ్చర్యానికి హద్దుల్లేవు." అంటూ సిరాజ్ ఆనందంతో వెల్లడించాడు.
అదృష్టం అంటే ఇదే..
కేవలం స్క్వాడ్లోకి రావడమే కాకుండా.. జస్ప్రీత్ బుమ్రా అనారోగ్యం కారణంగా సిరాజ్కు నేరుగా ప్లేయింగ్ XIలో చోటు దక్కింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న సిరాజ్.. అమెరికాపై 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. "దేవుడు నా తలరాతను మార్చాడు. విమానంలో టీ20 ప్రపంచకప్ జట్టుతో ప్రయాణించడం నాకు ఒక కలలా అనిపించింది. రంజీ ట్రోఫీలో ఏ లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేశానో, ఇక్కడ కూడా అదే ప్లాన్ అమలు చేశాను" అని మహ్మద్ సిరాజ్ తెలిపారు.
టీమిండియా శుభారంభం
గ్రూప్-ఏలో భాగంగా అమెరికాతో వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్లో టీమిండియా 29 పరుగుల తేడాతో గెలుపొందింది. పసికూన అమెరికా నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైనా.. సూర్యకుమార్ యాదవ్ అద్భుత బ్యాటింగ్, బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో ఓటమి నుంచి గట్టెక్కింది. ఈ మ్యాచ్లో భారత్ గెలిచినా.. బ్యాటింగ్ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 84 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాక్విక్(4/25) నాలుగు వికెట్లు తీయగా.. హర్మీత్ సింగ్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. అలీ ఖాన్(1/13), మహమ్మద్ మోహ్సిన్(1/16) తలో వికెట్ తీసారు.
అనంతరం అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేసి ఓటమిపాలైంది. మిలింద్ కుమార్(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 34), సంజయ్ కృష్ణమూర్తి(31 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/29) మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్(2/22), అర్ష్దీప్ సింగ్(2/18) రెండేసి వికెట్లు పడగొట్టారు. వరుణ్ చక్రవర్తీ ఒక వికెట్ దక్కింది.