మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికాతో భారత్ ఆఖరి మ్యాచ్ ఆడనుంది. సిరీస్ను కాపాడుకోవాంటే ఈ రోజు మ్యాచ్ టీమిండియా తప్పక గెలవాల్సిందే. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా, రెండో టీ20లో సౌతాఫ్రికా అయిదు వికెట్ల తేడాతో గెలిచింది. రెండో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా టార్గెట్ ను 15 ఓవర్లలో 152గా నిర్ణయించారు. సౌతాఫ్రికా 13.5 ఓవర్లలో విజయాన్ని సాధించింది.
అయితే రెండో టీ20లో భారత బౌలర్లు పేలవ ప్రదర్శనపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విశ్లేషించాడు. మహ్మద్ సిరాజ్కు మద్దతు ఇస్తూ, ముకేశ్ను కొనియాడుతూ, అర్షదీప్ సింగ్ పర్ఫార్మెన్స్పై నిరాశ వ్యక్తం చేశాడు. సిరాజ్ ఇంత కంటే చెత్త ప్రదర్శన చేయగలడని గంభీర్ అన్నాడు. కానీ సిరాజ్ తర్వాత మ్యాచ్ల్లో మెరుగైన గణాంకాలతో ముగిస్తాడని అభిప్రాయపడ్డాడు. అర్షదీప్ ప్రదర్శన పేలవంగా ఉందని తెలిపాడు. అయితే బాల్ తడిగా ఉన్న పరిస్థితుల వల్ల ఇలా జరిగిందని వివరించాడు.

తొలి ఓవర్ 14 పరుగులు సమర్పించుకున్న సిరాజ్ తర్వాత ఓవర్ లో 8 పరుగులిచ్చి క్లాసెన్ వికెట్ పడగొట్టాడు. మరోవైపు అర్షదీప్ సింగ్ తన తొలి ఓవర్ లో 24 పరుగులు ఇచ్చాడు. ''ముకేశ్ 13 ఓవర్ గొప్పగా బౌలింగ్ చేశాడు. వెట్ బాల్ తో డేవిడ్ మిల్లర్ వంటి ప్లేయర్కు పిన్ పాయింట్ యార్కర్లు విసిరాడు. ఇవి సానుకూలాంశాలే. బంతి తడిగా లేకపోతే మన బౌలింగ్ మరోలా ఉండేది'' అని గంభీర్ అన్నాడు.
''ప్రపంచకప్ ఆరు నెలల ముందు జరిగే ఈ ద్వైపాక్షిక సిరీస్ల గురించి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. అయితే టీమిండియా తమ బౌలర్లను పరీక్షించాలనుకుంటుంది. డెత్ ఓవర్లలో ఎవరూ ఎలా రాణిస్తున్నారో పరిశీలిస్తోంది. టీ20 ప్రపంచకప్లో డెత్ ఓవర్లలో బుమ్రాకు తోడుగా ఎవరూ ఉంటారో చూడాలి'' అని గంభీర్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జూన్ లో వెస్టిండీస్-అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది.