
బ్రిస్బేన్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆసీస్ అభిమానుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. మొన్న సిడ్నీ టెస్టులో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు మన ఆటగాళ్లపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసిన విషయం మరువక ముందే మళ్లీ అలాంటి ఘటనే వెలుగు చూసింది. బ్రిస్బేన్లో నాలుగో టెస్టు ఆడుతున్న సమయంలో.. ఫీల్డింగ్ చేస్తున్న హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్పై ఓ అభిమాని నోరు పారేసుకున్నాడు.
గబ్బా స్టేడియంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మహమ్మద్ సిరాజ్పై స్టాండ్లో కూర్చున్న ఇద్దరు అభిమానూలు నోరు పారేసుకున్నారు. 'మా వైపు చేతులు ఊపు సిరాజ్' అంటూ కేకలు వేసిన అతను చివరికి.. 'సిరాజ్, యూ బ్లడీ గ్రబ్ (గలీజు మనిషి)' అని తిట్టాడు. సిరాజ్తో పాటు మరో బౌలర్ వాషింగ్టన్ సుందర్ను కూడా ప్రేక్షకులు టార్గెట్ చేశారని సమాచారం తెలుస్తోంది. ఈ విషయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.
సిడ్నీ టెస్టులో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్, బుమ్రాపై ఆస్ట్రేలియన్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై ఇప్పటికే టీమిండియా మేనేజ్మెంట్ క్రికెట్ ఆస్ట్రేలియా దృష్టికి తీసుకెళ్లగా.. చర్యలు తీసుకుంది. కామెంట్ చేసిన ఆరుగురిని గుర్తించి స్టేడియం నుంచి బయటకు గెంటేశారు. ఆపై వారిని పోలీసులకు అప్పగించారు. వారం గడవక ముందే మళ్లీ అదే తరహా ఉదంతం వెలుగు చూడటంతో టీమిండియా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించనుంది.
హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ (1996) తర్వాత హైదరాబాద్లో పుట్టి, టెస్టు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రికెటర్ మొహ్మద్ సిరాజే కావడం విశేషం. మధ్యలో మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆడినా.. అతను భువనేశ్వర్లో పుట్టాడు. సిరాజ్ ఇప్పటివరకు భారత్ తరఫున ఒక వన్డే, మూడు టీ20లు, మూడు టెస్టులు (గబ్బాలో జరుగుతున్న నాలుగో టెస్ట్లో ఆడుతున్నాడు) ఆడాడు.