Mohammed Shami: భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా భార్య హసీన్ జహాన్తో తన వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాహం తన జీవితంలో ఒక పెద్ద తప్పు అని అంగీకరించినప్పటికీ.. దానిని తన అదృష్టంగా భావిస్తున్నానని, ఎవరినీ నిందించదలుచుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా మహమ్మద్ షమీ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న వివాదాలు ఆయన కెరీర్పై కూడా ప్రభావం చూపుతున్నాయి.
'ఆప్ కీ అదాలత్'లో మనసు విప్పిన షమీ
ప్రస్తుతం క్రికెట్కు దూరంగా ఉన్న మహమ్మద్ షమీ.. మళ్లీ టీమిండియాలోకి తిరిగి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ప్రముఖ టీవీ షో 'ఆప్ కీ అదాలత్'లో పాల్గొన్నారు. ఈ షోలో తన వ్యక్తిగత జీవితం గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన చాలా ఓపెన్ గా సమాధానం ఇచ్చారు. తన పెళ్లి గురించి షమీ మాట్లాడుతూ.. "జీవితం మనిషికి చాలా విషయాలు నేర్పుతుంది. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు ఇదేనని నేను నమ్ముతాను. కానీ నేను ఎవరినీ నిందించను. ఇది నా అదృష్టం, ఇది నా కర్మ" అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఎంత మానసిక ఒత్తిడిలో ఉన్నారో తెలియజేస్తున్నాయి.

దేశం కోసం ఆడుతున్నప్పుడు ఇంటి సమస్యలు
జట్టులో చోటు కోల్పోవడంపై కూడా షమీ తన మనసులో మాట చెప్పారు. ఓ అంతర్జాతీయ క్రికెటర్ దేశం కోసం ఆడుతున్నప్పుడు తన దృష్టిని రెండు వైపులా విభజించాల్సి వస్తుందని ఆయన అన్నారు. షమీ మాట్లాడుతూ.. "ఇది చాలా కష్టమైన సమయం. ఒకవైపు ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకోవాలి. మరోవైపు దేశం కోసం మంచిగా ఆడాలి. ఇది ఓ ఆటగాడిపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది" అని షమీ చెప్పారు. ఒక ప్రొఫెషనల్ ప్లేయర్గా మైదానంలో దృష్టి పెట్టడం ఎంత ముఖ్యమో, వ్యక్తిగత జీవిత సమస్యలు దానిని ఎలా ప్రభావితం చేస్తాయో ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది.
తన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అని అడిగినప్పుడు.. "ఎవరూ తమ ఇంట్లో గొడవలు కోరుకోరు, ముఖ్యంగా దేశం కోసం ఆడుతున్నప్పుడు. కానీ సమస్య పరిష్కారం అవతలి వ్యక్తిపై కూడా ఆధారపడి ఉంటుంది. అవతలి వైపు వారు దానికి సిద్ధంగా లేకపోతే, సహనం ఒక్కటే చివరి పరిష్కారం" అని షమీ తన నిస్సహాయతను వ్యక్తపరిచారు.
షమీ చివరి మ్యాచ్ ఎప్పుడు?
భారత క్రికెటర్ మహమ్మద్ షమీ చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఆసియా కప్ 2025 జట్టులో కూడా ఆయనకు చోటు దక్కలేదు. ఆయన చివరిసారిగా టీమిండియా తరఫున ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఆడారు. ఆ మ్యాచ్లో షమీ 9 ఓవర్లలో 74 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశారు. అప్పటి నుంచి ఆయన టీమ్ సెలక్షన్కు దూరంగా ఉంటూ జట్టులోకి తిరిగి రావడానికి కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. మహమ్మద్ షమీ లాంటి అనుభవజ్ఞుడైన బౌలర్ తిరిగి జట్టులోకి రావాలని భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.