
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమిని ఎదుర్కొన్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శనివారం రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తుండగా.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి గాయమైంది. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో బంతి షమీ మణికట్టుకు బలంగా తాకింది. దీంతో అతడు బాధతో విలవిల్లాడాడు. వెంటనే జట్టు ఫిజియో మైదానంలోకి వచ్చి ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశాడు.
అయితే ఆ సమయంలో మహ్మద్ షమీ తన చేతిని కూడా పైకిలేపడానికి బాగా ఇబ్బందిపడ్డాడు. దీంతో తాడు రిటైర్డ్ ఔట్గా మైదానాన్ని వీడాడు. స్కానింగ్ కోసం వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. టెస్టు సిరీస్లోని మిగతా మ్యాచ్ల్లో షమీ ఆడటంపై ఇప్పుడు ఆందోళన నెలకొంది. షమీ రెండో టెస్టులో ఆడడం అనుమానంగానే ఉంది. స్కానింగ్ రిపోర్టులు వస్తే గాయం తీవ్రతపై ఓ అంచనాకు రావొచ్చని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం తెలిపాడు.
'మహ్మద్ షమీ గురించి కొత్త వార్తలేమీ లేవు. స్కానింగ్ చేయంచుకోడానికి ఆసుపత్రికి వెళ్లాడు. నొప్పి చాలా తీవ్రంగా ఉంది. చేతిని కదిలించలేకపోతున్నాడు. ఏం జరిగిందనేది సాయంత్రానికల్లా తెలుస్తుంది' అని మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్టు నాటికి షమీ కోలుకోకుంటే భారత జట్టుకు అది భారీ ఎదురుదెబ్బే అవుతుంది. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయంతో ఇప్పటికే సిరీస్కు దూరమయ్యాడు. ఇప్పుడు షమీ కూడా లేకుంటే పేస్ బౌలింగ్లో భారత్కు తిప్పలు తప్పవు.

బలంగా తాకడంతో బాధను భరించలేని మహ్మద్ షమీ రిటైర్డ్ ఔట్గా మైదానాన్ని వీడాడు. దీంతో భారత జట్టు రెండో ఇన్సింగ్స్ 36/9 వద్ద ముగిసింది. ఆస్ట్రేలియా విజయానికి 90 పరుగులు అవసరం కాగా.. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బ్యాట్స్మన్ అంపైర్ అనుమతి లేకుండా.. తన సొంతంగా నిర్ణయం తీసుకొని ఇన్నింగ్స్ కొనసాగించకుండా బయటికే వెళ్లిపోవడాన్ని రిటైర్డ్ ఔట్గా పరిగణిస్తారు. రిటైర్డ్ ఔట్గా ఎవరైనా బ్యాట్స్మన్ బయటికి వెళ్లిపోతే మళ్లీ ఆడేందుకు అనుమతించరు. క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు రిటైర్డ్ ఔట్ రెండుసార్లు మాత్రమే చోటుచేసుకుంది.