దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, ఫిట్నెస్ నిరూపించుకోలేక బోర్డర్ - గావస్కర్ ట్రోఫీకి ఎంపికకాని స్టార్ పేసర్ మహ్మద్ షమీ, ఎలాగైనా ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన కమ్ బ్యాక్ గురించి మాట్లాడాడు షమీ. ప్రస్తుతం తన జీవితం ఎంతో కష్టంగా గడుస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి జట్టును ప్రకటించడానికి సమయం దగ్గర పడిన తరుణంలో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. జట్టులోకి ఎవరిని తీసుకుంటారు, ఎవరిని పక్కకు పెడతారు అన్న విషయంపై తెగ చర్చించుకుంటున్నారు. అయితే చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని బాధపడిన షమీ పూర్తిగా కోలుకున్నట్లు, ఈ మేరకు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వైద్యుల బృందం మహ్మద్ షమీకి ఫిట్నెస్ క్లియరెన్స్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో, అంతర్జాతీయ క్రికెట్లో షమీ రీఎంట్రీకి మార్గం సుగమం అయినట్టేనని కథనాలు వస్తున్నాయి.

ఇప్పటికే షమీ దేశవాళీ క్రికెట్లో ఆడుతున్నాడు. వన్డే ఫార్మాట్లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో మూడు మ్యాచుల్లో ఐదు వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 11 వికెట్లు పడగొట్టాడు. పైగా నెట్ ప్రాక్టీస్ సెషన్ కూడా అద్భుతంగా చేస్తూ కనిపించాడు. దీంతో అతడు నేషనల్ టీమ్ లోకి రావడం గ్యారంటి అనీ, ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్ కు, ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేస్తారని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా షమీ తన కమ్ బ్యాక్ పై స్పందించాడు. ఆనంద్ బజార్ పత్రికాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ మాట్లాడుతూ .. "దేవుడు అనుకుంటే ప్రతీది సాధ్యమే. అన్నీ జరుగుతాయి. ఓ ప్లేయర్ కు ఆటే అన్నీ. అది లేకపోతే జీవితం అసంపూర్తిగా అనిపిస్తుంది. మరి అలాంటిది బంతి పట్టుకోకపోతే నా జీవితాన్ని ఎలా ఆస్వాదిస్తాను. జీవితం చాలా కష్టంగా సాగుతుందని మాత్రం చెప్పగలను. దేశానికి ఆడుతున్నామనే మోటివేషన్ చాలు. నా రిహ్యాబిలిటేషన్ లో ప్రతీరోజు ఇండియన్ జెర్సీని చూస్తూనే ఉంటాం. ఇక డొమాస్టిక్ క్రికెట్ లో బెంగాల్ జట్టుకు ఆడటంతో , నా పాత రోజుల అనుభూతి కలిగింది. అది నాలో కొత్త శక్తిని ఇచ్చి సరికొత్త ఉత్సాహాన్ని నింపింది." అని చెప్పుకొచ్చాడు.
కాగా, షమీ చివరి సారిగా 2023 వన్డే ప్రపంచ కప్లో అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అప్పుడు చీలమండ గాయం అవడంతో లండన్ వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. కోలుకొని ఫిట్నెస్పై దృష్టి సారించాడు. వాస్తవానికి బోర్డర్ - గావస్కర్ ట్రోఫీకి ఎంపికవుతాడని అంతా భావించారు. కానీ, పూర్తి ఫిట్నెస్ లేకపోవడం వల్ల చివరి నిమిషంలో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు.
ఇకపోతే జనవరి 22 నుంచి టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20 మ్యాచ్లు, 3 వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో వన్డే మ్యాచ్లు నిర్వహిస్తారు.