సౌతాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ ఆ ఫార్మాట్కు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అంతకు ముందే కోహ్లీ వన్డే, టీ20 కెప్టెన్సీకి కూడా దూరమయ్యాడు. దీంతో కెప్టెన్గా విరాట్ కోహ్లీ కథ ముగిసింది. కాగా ఇప్పటికే వన్డే, టీ20లకు రోహిత్ శర్మ కెప్టెన్గా ఉన్నాడు. అయితే ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటికే పరిమిత ఓవర్ల జట్టుకు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మనే కెప్టెన్గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ వంటి ఆటగాళ్ల పేర్లు కూడా చర్చకు వస్తుండడంతో ఆసక్తి నెలకొంది. ఇటు అభిమానులు, అటు మాజీలు టీమిండియాకు టెస్ట్ కెప్టెన్ ఎవరనే అంశంపై తెగ చర్చిస్తున్నారు. కొందరైతే పలానా ఆటగాడు అయితే బాగుంటుందని ఓ పేరును కూడా సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా టెస్ట్ కెప్టెన్సీపై వెటరన్ పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. టీమిండియాకు టెస్టు కెప్టెన్సీ చేసే అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తానని చెప్పాడు. ప్రస్తుతం తాను భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో అందుబాటులో ఉంటున్నానని, కెప్టెన్సీ చేసే అవకాశం వస్తే తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. అయితే ప్రస్తుతం తాను కెప్టెన్సీ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదని ఆయన తెలిపాడు. నిజానికి టీమ్ఇండియాకు కెప్టెన్సీ చేపట్టే అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదంటారని షమీ చెప్పుకొచ్చాడు. అయితే కెప్టెన్గా మాత్రమే కాకుండా జట్టుకు ఏ విధంగానైనా ఉపయోగపడడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు. జట్టు కోసం తనకు ఏ పని ఇచ్చిన 100 శాతం న్యాయం చేస్తానని ఈ టీమిండియా సీనియర్ పేసర్ తెలిపాడు.
కాగా సౌతాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్లో మహ్మద్ షమీ సత్తా చాటాడు. మొత్తం మూడు టెస్టు మ్యాచ్ల్లో కలిపి 14 వికెట్లు తీశాడు. అనంతరం సౌతాఫ్రికా పర్యటనలో జరిగిన వన్డే సిరీస్కు షమీకి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం వెస్టిండీస్తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్కు కూడా షమీకి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కాగా టెస్ట్ క్రికెట్లో షమీ ఇప్పటివరకు 209, వన్డేల్లో 148, టీ20ల్లో 18 వికెట్లు తీశాడు. అలాగే ఐపీఎల్లోనూ 79 వికెట్లతో సత్త చాటాడు. ప్రస్తుతం భారత జట్టులో షమీ కీలక బౌలర్గా రాణిస్తున్నాడు. రానున్న భవిష్యత్లోనూ ఈ పేసర్పై భారీ అంచనాలు ఉన్నాయి.