హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై అతడి భార్య నమోదు చేసిన కేసుకు సంబంధించి డాక్యుమెంట్లతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని బీసీసీఐ సీఈఓ వినోద్ రాయ్కు పంపినట్లు ఆమె వెల్లడించింది. షమీపై హసీన్ జహాన్ గత వారం గత వారం కోల్కతాలోని జదవ్పూర్ పోలీసు స్టేషన్లో లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఆమె కోసం రూ. 1.5కోట్లు ఖర్చు పెట్టా, నన్ను ఉరి తీయండి: షమీ
దీంతో పోలీసులు సెక్షన్ 307 (హత్యాయత్నం), సెక్షన్ 323 (గాయపరచడం), సెక్షన్ 376 (రేప్), సెక్షన్ 506 (నేరపూరిత కుట్ర), సెక్షన్ 328, సెక్షన్ 34ల కింద షమీతో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. హసీన్ పోలీస్ స్టేషన్లో షమీపై చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కాపీని బీసీసీఐకి పంపినట్లు ఆమె తరఫు న్యాయవాది జకీర్ హుస్సేన్ తెలిపారు.
'గురువారం కోల్కతా పోలీస్ స్టేషన్లో షమిపై నమోదైన ఎఫ్ఐఆర్కు సంబంధించిన కాపీని సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్కి పంపించాం' అని జకీర్ చెప్పారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు గాను పాకిస్థాన్ అమ్మాయి అలీస్బా ద్వారా షమీ డబ్బు తీసుకున్నట్లు షమి భార్య హసీన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఇందుకు ఇంగ్లాండ్కు బిజినెస్ మ్యాన్ మహమ్మద్ భాయ్ మధ్యవర్తిత్వం వహించాడని పేర్కొంది. ఈ ఆరోపణలపై దృష్టి సారించిన సీఓఏ దీనిపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం ఛైర్మన్ నీరజ్ కుమార్ను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే జకీర్ షమీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని బీసీసీఐ పంపడం చర్చనీయాంశమైంది.
మరోవైపు తన భార్య హసీన్ జహాన్ తనపై చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై షమీ స్పందించాడు. 'విచారణలో తాను ఫిక్సింగ్కు పాల్పడినట్లు తేలితే ఉరి తీయండి. నాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు. నేను దేశానికి ఎప్పుడూ ద్రోహం చేసే వ్యక్తిని కాదు' అని ఆవేదన వ్యక్తం చేశాడు. 'బీసీసీఐ తొందరపడి నా కాంట్రాక్టును రద్దు చేసింది. నేనెప్పుడూ నిజాయితీగానే ఆడాను' అని షమి కన్నీటి పర్యంతమయ్యాడు.