
హైదరాబాద్: వరుస ఆరోపణలతో థ్రిల్లింగ్ సీరియల్లా సాగుతోన్న షమీ, జహాన్ల కథలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. రెండ్రోజుల ముందు షమీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కూతురు ఫొటోను పోస్ట్ చేశాడు. అంతేకాదు, దాని కింద 'ఒహ్. చాక్లెట్ లవర్. ఐ మిస్ యూ బెబో..' అని ఉంచి ట్వీట్ చేశాడు. దీనిపై కూడా షమీ భార్య స్పందించారు. షమీ ఎప్పుడూ కుటుంబం పట్ల శ్రద్ధ చూపించలేదని పేర్కొన్నారు.
కూతురి ఫొటోను కేవలం సింపతీ కోసమే పోస్ట్ చేశాడన్నారు. వారిద్దరినీ ఫొటో తీయడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చేదన్నారు. కూతురి పట్ల లేని ప్రేమను ఒలకబోసేందుకే ప్రయత్నిస్తున్నాడు. కానీ, అందులో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపరేశారు. తాను బయటికి వచ్చేందుకు కేవలం కూతురి వంక చెప్పుకుంటున్నాడని ఆరోపించారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో ఎక్కడెక్కడ తిరిగాడనే వివరాలను కోల్కత్తా పోలీసులు తెలుసుకుంటున్నారని గుర్తు చేశారు. బీసీసీఐ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత నిజమేంటో తెలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పర్యటన అనంతరం దుబాయ్లో పాకిస్థాన్కు చెందిన యువతితో గడిపిన విషయం నిజమేనని నొక్కి చెప్పారు. త్వరలోనే నిజాలు బయటికి వస్తాయని ఆశఆభావం వ్యక్తం చేశారు.
షమీ తనను వేదించేవాడని, తన సోదరునితో అత్యాచారం కూడా చేయించబోయాడని, కుటుంబ సభ్యులందరూ కలిసి తనను హింసించేవారని, హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారంటూ.. పలు రకాల ఆరోపణలతో షమీ కుటుంబ సభ్యులపై హసీన్ జహాన్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు షమీపై పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.