
కోల్కతా: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సతీమణి హసిన్ జహాన్కు పటిష్ట భద్రత కల్పించాలంటూ కలకత్తా హైకోర్టు నగర పోలీసులను ఆదేశించింది. సోషల్ మీడియాలో తనకు బెదిరింపులు వస్తున్నాయని, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాంటూ హసిన్ జహాన్ చేసిన అభ్యర్థనపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. జహాన్ పిటీషన్ను పరిశీలించిన హైకోర్టు వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని కలకత్తా సిటీ పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. షమీ నుంచి విడిపోయిన జహాన్.. కూతురుతో కలిసి వేరుగా ఉంటున్న విషయం తెలిసిందే.
గత ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర భూమి పూజ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా హిందువులకు శుభాకాంక్షలు తెలిపిన హసిన్ జహాన్పై కొందరు ఆకతాయిలు తీవ్ర ట్రోలింగ్కు పాల్పడ్డారు. రేప్ చేసి చంపేస్తామని కూడా బెదరింపులకు దిగారు. అసభ్యకర పదజాలంతో త్రీవ్రంగా దూషించారు. ఈ ట్రోలింగ్ నేపథ్యంలో హసీన్ జహాన్ కలకత్తా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. అసభ్య పదజాలంతో ట్రోలింగ్ పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆగస్టు 9న ఫిర్యాదు చేశారు.
అయితే ఈ ఫిర్యాదుపై కలకత్తా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అప్పటి నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయని హసీన్ జహాన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తన కూతురు, తనకు రక్షణ కల్పించాలని కోరారు. షమీ సతీమణి చేసిన అభ్యర్థనపై హైకోర్టు విచారణ జరిపి ఆమెకు పోలీసు రక్షణ కల్పించాలని సిటీ పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను 4 వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ దెబాంగ్సు బసక్ పేర్కొన్నారు. అయితే లాల్ బజార్ పోలీస్స్టేషన్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
మహ్మద్ షమీ తనను హింసిస్తున్నాడని, అతనికి అనేక మంది అమ్మాయిలతో లైంగిక సంబంధాలు ఉన్నాయని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్ ఫిక్సింగ్కు కూడా పాల్పడ్డాడంటూ హసీన్ జహాన్ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు వరకట్నం వేధింపుల కేసు కూడా పెట్టారు. దీంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కోల్కతా పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం హసీన్ జహాన్ మోడల్గా కెరీర్ కొనసాగిస్తున్నారు. షమీ ప్రస్తుతం పంజాబ్ తరఫున ఐపీఎల్ 2020 ఆడుతున్నాడు.