హైదరాబాద్: టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తండ్రి తౌసీఫ్ షమీ (జనవరి 26) గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గుండె పోటు కారణంగా ఈ నెల జనవరి 5వ తేదీన ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఐసీయూకి తరలించి చికిత్స అందజేశారు.

ఆపరేషన్ అనంతరం ఆయన కోలుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఏమైందో ఏమో తెలియదు గాని గురువారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అమ్రోహలోని సాహస్పూర్ అలీనగర్లో తౌసీఫ్ మృతి చెందారు. షమీ తండ్రి మరణ వార్తను బెంగాల్ రంజీ జట్టుకు చెందిన ఫేస్బుక్ పేజీలో ధృవీకరిస్తూ పోస్టు చేశారు.
జనవరి 5వ తేదీన షమీ తండ్రి అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో శిక్షణ పొందుతున్న షమీ బెంగళూరు నుంచి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరి వెళ్లాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపాడు.
దీంతో షమీ తండ్రి కోలుకోవాలని పలువురు ప్రార్ధనలు సైతం చేశారు. షమీ తండ్రికి ఆపరేషన్ జరగడం జనవరి 7న తన తండ్రి పరిస్థితి మెరుగ్గా ఉందంటూ ట్విటర్లో షమీ తండ్రితో కలిసి దిగిన ఫొటో పోస్టు చేశాడు. అయితే ఇప్పుడు ఇలా జరగడంతో మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు షమీకి సంతాపం తెలిపారు.