హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీపై అతని భార్య హసీన్ జహాన్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. షమీకి అక్రమ సంబంధాలు ఉన్నాయని, తనను లైంగికంగా వేధించాడని హసీన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే షమీ మాత్రం తనకు తన భార్య, పాప అంటే ఎంతో ఇష్టమని.. హసీన్ చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి వాస్తవాలు లేవని వాదిస్తున్నాడు.
నాగ్పూర్ యువతితో షమీ ఛాటింగ్: ఫేస్బుక్లో ఫోటోలు పోస్టు చేసిన భార్య
తాజాగా మంగళవారం షమీ ఖాతా నుంచి హసీన్ అకౌంట్కు రూ.లక్ష ట్రాన్స్ఫర్ అయ్యాయి. దీనికి సంబంధించి బ్యాంకు స్టేట్మెంట్ను షమీ విడుదల చేశాడు. ఇందులో ఈ నెల 20వ తేదీన షమీ చెక్ ద్వారా హసీన్ ఖాతాకు రూ.లక్ష లావాదేవీ అయినట్లు ఉంది. తన ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయిందని తెలుసుకున్న షమీ వెంటనే ఇతర చెక్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.
తనను భార్యగా షమీ ఎన్నడూ గుర్తించలేదని, తనకు కనీస ప్రాముఖ్యత కూడా ఇవ్వలేదని హసీన్ మీడియా ముందు తన గోడుని వెళ్లబోసుకున్న సంగతి తెలిసిందే. షమీపై ఇన్ని చెప్పిన హసీన్ ఈ చెక్ విషయాన్ని ఎందుకు దాచి పెట్టిందా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు షమీ భార్య జహాన్ చేసిన మ్యాక్స్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ(ఏసీయూ) నిర్ధారించిన నేపథ్యంలో అతడిని సెంట్రల్ కాంట్రాకులో కొనసాగించనున్నట్లు బీసీసీఐ గురువారం అధికారిక ప్రకటన చేసింది.
గతంలో ఉన్న విధంగానే షమీకి 'బి గ్రేడ్' కాంట్రాక్ట్ను బీసీసీఐ అందించింది. తద్వారా షమీ ఇతర ఆటగాళ్లతో పాటు రూ.3 కోట్లు వేతనంగా అందుకోనున్నాడు. పాకిస్థాన్కు చెందిన అలీష్బా అనే మహిళ పంపిన డబ్బును షమీ దుబాయ్లో మహ్మద్ భాయ్ వ్యక్తి నుంచి తీసుకున్నట్లు హసీన్ జహాన్ ఆరోపించింది.
భార్య ఆరోపణలతో బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్ట్ ఆటగాళ్ల వివరాల జాబితా నుంచి షమీ పేరును తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ(ఏసీయూ) హెడ్ నీరజ్ కుమార్ విచారణ చేశారు. ఈ విచారణలో షమీ భార్య హసీన్ను, మహ్మద్ షమీని, ఆరోపణల్లో పేర్కొన్న వ్యక్తులను బీసీసీఐ అధికారులు ప్రశ్నించారు.
విచారణ పూరైన అనంతరం ఏసీయూ తన నివేదికను కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ)కి సమర్పించింది. ఈ నివేదికలో షమీకి ఏసీయూ క్లీన్ చీట్ ఇవ్వడంతో బీసీసీఐ షమీకి తిరిగి కాంట్రాక్ట్ ఇచ్చింది.