
ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ప్రతిష్ఠాత్మక ఐసీసీ టోర్నమెంట్ అయిన టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీమిండియా కొన్ని టీ20 మ్యాచ్లు మాత్రమే ఆడనుంది. దీంతో టీమిండియా జట్టు ఎంపిక గందరగోళంగా మారింది. ఇకపోతే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో జట్టు మేనేజ్మెంట్ చాలా మంది కొత్తవారికి అవకాశం ఇచ్చింది. అందులో హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్ కొద్దో గొప్పో బానే రాణిస్తున్నారు. అయితే ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్ మాత్రం ఇప్పటికీ తుది జట్టులో ఆడలేదు. ఇకపోతే టీమిండియా బౌలింగ్ స్క్వాడ్లో టీ20ప్రపంచకప్ జట్టులో ఎవరుంటారనే డైలామా కొనసాగుతుంది.
భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా లాంటి టాప్ క్లాస్ బౌలర్లు దాదాపు ఎంపికయ్యే అవకాశముండగా.. హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్లు, ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్, మహమ్మద్ షమీ లాంటి బౌలర్లలో ఎవరు ఎంపికవుతారనే విషయంలో ఇంకా డైలామా ఉంది. ఇకపోతే ఈ విషయమై భారత మాజీ బౌలర్, గుజరాత్ టైటాన్స్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్లో షమీ ఆడకపోవచ్చని పేర్కొన్నాడు. కాకపోతే వచ్చే ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్లో మాత్రం షమీ కచ్చితంగా ఉంటాడని తెలిపాడు.

క్రిక్ బజ్తో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ.. 'షమీ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ జట్టు సెలెక్షన్ ప్రణాళికలో లేనట్లు అనిపిస్తుంది. అయిన జట్టు మేనేజ్మెంట్కు షమీ అవసరమైతే అతన్ని తీసుకునే వీలుంది. ఎందుకంటే బౌలర్గా షమీ సత్తా ఏంటో మనందరికీ తెలుసు. అతను టీ20 ప్రపంచకప్ ఆడతాడో లేదో కానీ అతను టెస్ట్ క్రికెట్ మట్టుకు కచ్చితంగా ఆడతాడు. ఇక వచ్చే ఏడాది జరిగే 50ఓవర్ల ప్రపంచ కప్ కోసం మాత్రం షమీ కచ్చితంగా ఎంపికవుతాడు' అని నెహ్రా అన్నాడు. ఇక జులై 1 నుంచి 5వరకు ఇంగ్లాండ్లో ఆ దేశ జట్టుతో జరగబోయే రీషెడ్యూల్ టెస్టులో షమీ ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నెహ్రా అభిప్రాయపడ్డాడు.
ఇకపోతే భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జులై 11నుండి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. వైట్-బాల్ క్రికెట్లో ఇంగ్లాండ్ను ఓడించాలంటే టీమిండియా తమ అత్యుత్తమ ఆటగాళ్లను బరిలోకి దించాల్సి ఉంటుందని, అందులో షమీ కచ్చితంగా ఉంటాడని నెహ్రా పేర్కొన్నాడు. 'ఈ ఏడాది టీమిండియాకు ఎక్కువ వన్డే మ్యాచ్లు లేవు, ఇక ఐపీఎల్ తర్వాత షమీ ప్రస్తుతం విరామంలో ఉన్నాడు. ఇంగ్లాండ్తో వన్డేలంటే మాటలు కాదు. ఆ జట్టును ఓడించాలంటే జట్టులో అత్యుత్తమ బౌలర్లు కావాలి. నా వరకైతే వన్డేల కోసం కచ్చితంగా షమీని తుది జట్టులోకి తీసుకుంటారని భావిస్తున్నాను.' అని నెహ్రా పేర్కొన్నాడు.