హైదరాబాద్: గాయం కారణంగా కొన్నాళ్లు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీ బుధవారం తిరిగి జట్టులో చేరాడు. భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఫలితాన్ని తేల్చే నాలుగో టెస్టుకు గాయం నుంచి కోలుకున్న పేసర్ మహ్మద్ షమీని తీసుకునే అవకాశం ఉందని కెప్టెన్ కోహ్లీ రాంచీ టెస్టు అనంతరం సూచన ప్రాయంగా చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నాలుగో టెస్టుకు కెప్టెన్ కోహ్లీ వెంటనే రావాలని కోరడంతో అతను ఆగమేఘాల మీద ధర్మశాలకు బయల్దేరాడు. అయితే షమీని జట్టులోకి తీసుకున్నట్లు ఇప్పటివరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేయలేదు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరి టెస్టు భారత్-ఆస్ట్రేలియాల మధ్య మార్చి 25 నుంచి ధర్మశాలలో ప్రారంభం కానుంది.

మూడో టెస్టు ముగిసిన అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'సెలెక్టర్లతో మాట్లాడలేదు కానీ.. అన్నీ అనుకూలిస్తే తర్వాతి మ్యాచ్కు షమీని జట్టులోకి తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నాం. మ్యాచ్ ప్రాక్టీస్ కోసమే అతన్ని విజయ్ హజారే ఫైనల్ ఆడమని సూచించాం' అని కోహ్లీ చెప్పాడు.
ఇరు జట్లు మంగళవారం సాయంత్రమే ధర్మశాలకు చేరగా షమీ బుధవారం ఉదయం ఇక్కడ అడుగుపెట్టాడు. తాను ధర్మశాలలో అడుగుపెట్టినట్లు షమీ తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. కాగా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ సందర్భంగా మోకాలి గాయం కావడంతో ఆ తర్వాత ఆ టీమ్తో జరిగిన వన్డే, టీ20 సిరీస్కు బంగ్లాదేశ్తో ఏకైక టెస్ట్కు దూరమయ్యాడు.
ఆసీస్ సిరీస్కు ముందు కూడా మ్యాచ్ ఫిట్ కాకపోవడంతో అతన్ని ఎంపిక చేయలేదు. తమిళనాడుతో సోమవారం జరిగిన విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో బెంగాల్ తరఫున ఆడిన షమీ నాలుగు వికెట్లు తీశాడు. ఇప్పుడు సెలక్టర్లు షమీకి గ్రీన్సిగ్నల్ ఇస్తే ధర్మశాల టెస్టులో అతను తుది జట్టులో చోటు సంపాదించడం ఖాయం.