టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి ప్రతిష్టాత్మక అర్జున పురస్కారాన్ని అందుకున్నాడు. జాతీయ క్రీడా పురస్కారాల కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నాడు. 2023 సంవత్సరంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు కేంద్రం అవార్డులను ప్రదానం చేస్తోంది.
మొత్తం 26 మంది క్రీడాకారులు అర్జున పురస్కారాన్ని అందుకున్నారు.అయితే క్రికెట్ నుంచి మహ్మద్ షమి మాత్రమే ఈ అవార్డును అందుకున్నాడు. 2023లో షమి సంచలన ప్రదర్శనకు గానూ బీసీసీఐ ప్రత్యేకంగా కేంద్రానికి అతడి పేరును సిఫార్సు చేసింది. కాగా, గతంలో అర్జున అవార్డును క్రికెట్ విభాగం నుంచి శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు అందుకున్నారు.

అవార్డు అందుకున్న అనంతరం షమి ఎమోషనల్ అయ్యాడు. "కల నెరవేరింది. చాలా మంది తమ జీవితంలో ఈ అవార్డు అందుకోలేరు. ఈ పురస్కారం కోసం నన్ను నామినేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు సాధించడం ఓ కలగా ఉంది" అని షమి అన్నాడు.
కాగా, రాష్ట్రపతి చేతుల మీదుగా షమి అవార్డు తీసుకుంటున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారింది. షమికి శుభాకాంక్షలు చెబుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో షమి పేరు ట్రెండింగ్లోకి వచ్చేసింది. కాగా, ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్లో షమి సంచనల ప్రదర్శన చేశాడు. ఈ మెగాటోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచాడు. కేవలం ఏడు మ్యాచ్లు ఆడిన షమి ఏకంగా 24 వికెట్లు పడగొట్టాడు.
అయితే వన్డే వరల్డ్ కప్ అనంతరం చీలమండ గాయంతో షమి టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్సీఏలో కోలుకుంటున్నాడు. గాయం గురించి షమి మాట్లాడుతూ.. '' గాయాలు ఆటలో భాగమే. కానీ అభిమానులు, ప్రజల ప్రేమ చాలా ముఖ్యం. ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నా. నా పురోగతిపై NCAలోని వైద్యనిపుణులు సంతోషంగానే ఉన్నారు. చీలమండ సమస్య కాస్త ఉన్నప్పటికే మంచిగానే ఉన్నాను. ట్రైనింగ్ సెషన్స్ మొదలుపెట్టాను కూడా. ఇంగ్లాండ్ సిరీస్తో రీఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నా. దానికి తగ్గట్టుగానే ఫిట్నెస్ సాధిస్తున్నా'' అని అన్నాడు.
జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్తో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. మొహాలి వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్ వేదికగా జనవరి 14న రెండో టీ20, బెంగళూరు వేదికగా జనవరి 17న ఆఖరి మ్యాచ్ జరగనుంది. అనంతరం జనవరి 25 నుంచి ఇంగ్లాండ్తో టీమిండియా అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది.