తన మోకాలికి వాపు వచ్చిందని, దాంతో ఆటకు మరో రెండు నెలల పాటు దూరం కానున్నట్లు తనపై వస్తున్న వార్తలపై టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి స్పందించాడు. నిరాధారమైన పుకార్లను ఎందుకు ప్రచారం చేస్తున్నారని మీడియాపై మండిపడ్డాడు. 2023 వన్డే వరల్డ్ కప్ అనంతరం చీలమండల గాయంతో షమి జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
పెయిన్ కిల్లర్స్ వాడుతూ వన్డే ప్రపంచకప్ ఆడిన షమి తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఎన్సీఏలో పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నాడు. దాదాపు పూర్తి ఫిట్నెస్ సాధించానని షమి ఇటీవల కూడా పేర్కొన్నాడు. ప్రత్యర్థితో, ఫార్మాట్తో సంబంధం లేకుండా రంజీ ట్రోఫీలో అయినా తిరిగి పోటీ క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు.

అయితే షమి మోకాలి వాపు వచ్చిందని, దాంతో కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఆటకు దూరం కానున్నాడని, ఆస్ట్రేలియా పర్యటనకు కూడా షమి అందుబాటులో ఉండనని బుధవారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మహ్మద్ షమి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ''ఇలాంటి నిరాధారమైన పుకార్లు ఎందుకు చేస్తున్నారు? కోలుకోవడానికి కష్టపడి శ్రమిస్తున్నాను. నా స్థాయి వరకు ఉత్తమంగా ప్రయత్నిస్తున్నాను''
''బోర్డర్ గావస్కర్ ట్రోఫీ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐగానీ, నేనుగానీ ఏం చెప్పలేదు. ఇలాంటి ఆధారాల్లేని వార్తలను ప్రజలు పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇలాంటి పుకార్లను, ఫేక్ న్యూస్ను ప్రచారం చేయకండి'' అని షమి ట్వీట్ చేశాడు. నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా అయిదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. పెర్త్ వేదికగా తొలి టెస్టు నవంబర్ 22-26 వరకు జరగనుంది. అలాగే అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్టు డిసెంబర్ 6-10 వరకు, బ్రిస్బేన్ వేదికగా డిసెంబర్ 14-18 వరకు మూడో టెస్టు, డిసెంబర్ 26-30 వరకు బాక్సింగ్ డే టెస్టు, సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్టు జరగనుంది.