
భారత్, పాకిస్థాన్ జట్ల ప్లేయర్లు ఇండియా - పాక్ మ్యాచ్లు జరగాలని, అందులో తాము ఆడాలని కోరుకుంటున్నారని పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ పేర్కొన్నాడు. కానీ.. ఇరు దేశాల మధ్య రాజకీయ సమస్యల కారణంగా అది కుదరడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశఆడు. టీమిండియా, పాకిస్తాన్ 2014 తర్వాత మళ్లీ ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఆడలేదు. 2014లో పాకిస్తాన్ ఇండియా పర్యటనకు రాగా.. అప్పట్లో రెండు టీ20లు, మూడు వన్డే సిరీస్లు జరిగాయి. ఇక ఆ తర్వాత పాక్, ఇండియా మధ్య సిరీస్లు జరగలేవు.
ఇకపోతే ఐసీసీ టోర్నీల్లో అప్పుడప్పుడు ఇండియా, పాక్ తలపడుతున్నాయి. గతేడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్లలో జరిగిన టీ20ప్రపంచకప్లో ఇరు జట్లు తలపడ్డాయి. ఇకపోతే 2005-06 సీజన్లో భారత్ చివరిసారిగా పాకిస్థాన్లో క్రికెట్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత భారత జట్టు పాకిస్థాన్ గడ్డ మీద అడుగుపెట్టలేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు అంత బాగా లేనందున ఇరువైపులా పర్యటనలు జరగడం అసంభవమనే చెప్పాలి.
రిజ్వాన్ మాట్లాడుతూ.. 'పాకిస్తాన్ మరియు టీమిండియా క్రికెటర్లు కలిసి మ్యాచ్లు ఆడాలని కోరుకుంటారు, కానీ దేశస్థాయిలోని రాజకీయ వ్యవహారాల వల్ల పాక్, ఇండియా మ్యాచ్లు జరగట్లేవు. అలాగే ఈ వ్యవహారాలను సద్దుమణించడం ప్లేయర్ల నియంత్రణలో లేవు' అని వెస్టిండీస్ పర్యటనకు ముందు రిజ్వాన్ మీడియాతో అన్నాడు. ఇకపోతే చటేశ్వర్ పుజారా ఏకాగ్రత, ఫోకస్ను రిజ్వాన్ మెచ్చుకున్నాడు.
ఇటీవల కౌంటీ ఛాంపియన్షిప్లో వీరిద్దరు ఒకే జట్టు ససెక్స్కు ఆడిన సంగతి తెలిసిందే. డర్హామ్తో జరిగిన మ్యాచ్లో వీరిద్దరు ససెక్స్ తరఫున 6వ వికెట్కు 154పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కౌంటీలో పుజారా రెండు సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు చేశాడు. ఇకపోతే రిజ్వాన్ పుజారా గురించి మాట్లాడుతూ.. 'క్రికెట్కు సంబంధించి చాలా విషయాలు నేను పుజారాతో చర్చించాను. అతని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆటగాళ్లుగా మాకు తేడా లేదు, మాది క్రికెట్ కుటుంబం. పుజారా చాలా మంచి వ్యక్తి. నేను అతని ఏకాగ్రతను, ఫోకస్ను ఇష్టపడతాను. యూనిస్ ఖాన్, ఫవాద్ ఆలం, పూజారా ముగ్గురు నా ఉద్దేశం ప్రకారం ఓ లెజెండరీ ప్లేయర్లు' అని రిజ్వాన్ పేర్కొన్నాడు.